
అంచనాల్ని మించి రాణించారు..
నమీబియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లకు తన చివరి సందేశాన్ని ఇచ్చాడు. కొంతకాలంగా గొప్పగా పోరాడారని కితాబిచ్చాడు. "జట్టుగా మీరంతా నా అంచనాల్ని మించి రాణించారు. కొన్నేళ్లుగా విదేశీ పర్యటనల్లో అన్ని ఫార్మాట్లలో ప్రతి జట్టును ఓడించాం. గొప్ప జట్టుగా ఎదిగాం" అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపేలా మాట్లాడాడు. అనంతరం ఆటగాళ్లందరూ రవిశాస్త్రికి షేక్ హ్యాండ్ ఇస్తూ వీడ్కోలు పలికారు. భారత జట్టుకు అతన్ని కోచ్గా నియమించిన అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్. శ్రీనివాసన్కు శాస్త్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. 2014లో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా 1-3 తేడాతో ఘోర పరాజయం పాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో శ్రీనివాసన్ తనపై నమ్మకంతో.. జట్టును బలోపేతం చేసే బాధ్యతలను అప్పగించాడని పేర్కొన్నాడు.

ఆయనకు స్పెషల్ థ్యాంక్స్..
'ఇన్నేళ్లుగా భారత జట్టుకు కోచ్గా కొనసాగడం గొప్ప విషయం. డ్రెస్సింగ్ రూమ్లో నాకు ఇదే చివరి రోజని తెలుసు. భారత క్రికెట్కు సేవలందించే గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. కోచ్గా నేను చేయగలిగినంతా చేశాననుకుంటున్నా. నా సామర్థ్యంపై నమ్మకంతో టీమిండియా కోచ్గా బాధ్యతలు అప్పగించిన శ్రీనివాసన్కు ప్రత్యేక ధన్యవాదాలు. నా పనితీరుపై ఆయనకు నమ్మకమెక్కువ. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాననుకుంటున్నా" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

2014లో మొదలై..
విరాట్ కోహ్లీ-రవి శాస్త్రి కాంబో 2014లో మొదలైంది. 2014లో ఆస్ట్రేలియా టూర్ మధ్యలో ధోనీ అనూహ్యంగా టెస్ట్ల నుంచి రిటైర్ అవ్వడంతో కెప్టెన్సీ అందుకున్న కోహ్లీ.. శాస్త్రితో జత కట్టాడు. అదే ఏడాది టీమిండియా డైరెక్టర్గా నియమితుడైన శాస్త్రి తర్వాత హెడ్ కోచ్ అయ్యాడు. 2016లో పదవి కోల్పోయినా 2017 జూలైలో తిరిగొచ్చాడు. అప్పటి నుంచి శాస్త్రి-కోహ్లీ జోడీ భారత్కు సక్సెస్ఫుల్ కోచ్-కెప్టెన్ జోడీగా పేరు తెచ్చుకుంది. ఇద్దరి కాంబినేషన్లో భారత్ 150 మ్యాచ్ ఆడింది. 2016 నుంచి 2020 వరకు 42 నెలల పాటు భారత జట్టు టాప్ ర్యాంక్లో కొనసాగింది. ద్వైపాక్షిక సిరీస్ల్లో శాస్త్రి-కోహ్లీ జోడీ చాలా సక్సెస్ సాధించింది. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ ఆస్ట్రేలియాలో భారత్ టీ20 సిరీస్లు నెగ్గింది.


Click it and Unblock the Notifications












