
పుజారా ఔట్
కేఎల్ రాహుల్ అనంతరం క్రీజులోకి వచ్చిన టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాట్స్మన్ చేతేశ్వర్ పుజారా కూడా పూర్తిగా నిరాశపరిచాడు. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ వేసిన మరో ఔట్ స్వింగర్కు పుజారా (1; 9 బంతుల్లో) బలయ్యాడు. 4.1వ బంతికి అతడు కీపర్ జోస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో భారత్ నాలుగు పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పుజారా అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. మరోవైపు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతున్నాడు. 24 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 2 పరుగులు మాత్రమే చేశాడు. భారత్ 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ (2), కోహ్లీ (3)లు ఉన్నారు.

చాన్నాళ్ల తర్వాత
చాన్నాళ్ల తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి బ్యాటింగ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మూడు ఫార్మాట్లలో కోహ్లీ, రోహిత్ కలిసి ఆడిన సందర్భాలు లేవనే చెప్పాలి. పరిమిత ఓవర్లలో రోహిత్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ.. ముందుగానే వికెట్ పారేసుకుంటున్నాడు. మరోవైపు కోహ్లీ కూడా గత కొంత కాలంగా ఫామ్లో లేడు.
దీంతో ఫార్మాట్ ఏదైనా ఈ ఇద్దరు ఎక్కువగా కలిసి ఆడలేదు. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పలేదు. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. మూడో టెస్టులో వీరిద్దరి ఆటపైనే భారత్ భవితవ్యం ఆధారపై ఉంది. తరుచూ వీరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయన్న వార్తలు అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇద్దరు క్రీజులో ఉండడంతో ఫాన్స్ ఖుషి అవుతున్నారు.

వన్డే ప్రపంచకప్తో మొదలు
2019 వన్డే ప్రపంచకప్ తుది జట్టు విషయంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విభేధాలు తలెత్తాయని మొదటిసారి ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలకు బలం చేకూర్చేలా కోహ్లీ, అనుష్క ఇన్స్టా ఖాతాలను రోహిత్ అన్ఫాలో చేయడం చర్చనీయాంశమైంది. అలాగే అనుష్క శర్మ కూడా రోహిత్తో పాటు అతని సతీమణి రితికాను అన్ ఫోలో చేయడం వీరి మధ్య విభేదాలు నిజమే అనుకునేలా చేశాయి. ఇక మ్యాచులు ఆడేటప్పుడు అనుష్క ఆ చివరన కూర్చొంటే రితిక ఈ చివరన కూర్చొని వీక్షించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ను ఎంపిక చేయకపోవడం వల్ల మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది.
నిజానికి రోహిత్ ఫిట్గా లేడనే అతనికి విశ్రాంతినిచ్చామని సెలక్టర్లు చెప్పారు. కానీ జట్టును ఎంపిక చేసినరోజే అతడు ప్యాడ్లు కట్టుకొని నెట్స్లో సిక్సర్లు బాదేస్తున్న వీడియోను ముంబై ట్విటర్లో పోస్ట్ చేయడం అనుమానాలకు తావిచ్చింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా టాస్కు వచ్చినప్పుడు రోహిత్, కోహ్లీ కనీసం ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకోలేదు. ఎడమొహం పెడమొహంగా కనిపించిన వీడియో వైరల్గా మారింది. ఇవన్నీ వీరి మధ్య విభేదాల వార్తలకు బలం చేకూర్చింది.

పరిమిత ఓవర్ల క్రికెట్కు రోహిత్
పరిమిత ఓవర్ల క్రికెట్కు రోహిత్ శర్మను, సుదీర్ఘ ఫార్మాట్కు విరాట్ కోహ్లీని సారథులుగా నియమించాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ప్రారంభమైన ప్రతీసారి, ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకున్నప్పుడల్లా ఈ డిమాండ్ తెరపైకి వస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఈ స్టార్ ఆటగాళ్ల అభిమానులు రెండుగా విడిపోవడం కూడా వీరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలకు ఆజ్యం పోసింది. అభిమానులకు తోడు గౌతమ్ గంభీర్ వంటి మాజీ క్రికెటర్లు కూడా కోహ్లీని తప్పుబడుతూ రోహిత్ శర్మను కొనియాడటం, కెప్టెన్సీ ఇవ్వమనడం కూడా విభేదాల వార్తలకు బలం చేకూర్చాయి. ఏది ఏమైనా ఇప్పుడు రోహిత్-కోహ్లీ కలిసి బ్యాటింగ్ చేయడం అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది.

విన్నింగ్ కాంబినేషన్తోనే
రెండో టెస్ట్ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. విన్నింగ్ కాంబినేషన్నే కోహ్లీ కొనసాగించాడు. దీంతో జట్టులో చోటు ఆశించిన వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు మరోసారి నిరాశే ఎదురైంది. లంక పర్యటన నుంచి వచ్చిన సూర్యకుమార్ యాదవ్కు కూడా జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు ఇంగ్లండ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. డోమ్ సిబ్లీ స్థానంలో డేవిడ్ మలన్, మార్క్ వుడ్ స్థానంలో క్రెయిగ్ ఓవర్టన్ జట్టులోకి వచ్చారు.


Click it and Unblock the Notifications

టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. సూర్య, అశ్విన్కు దక్కని చోటు! రెండు మార్పులతో బరిలోకి ఇంగ్లండ్!