టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు టీమిండియాకు తెరదించింది. ఈ గెలుపుతో 2007 టీ20 ప్రపంచకప్ తర్వాత మరో పొట్టి కప్ను ముద్దాడింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత ఐసీసీ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ చిరస్మరణీయ విజయంతో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియాకు తిరుగుండదని అంతా అనుకున్నారు. మరిన్నీ ఐసీసీ టైటిళ్లు కూడా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత జట్టులో కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోగా.. గౌతమ్ గంభీర్ కొత్త కోచ్గా ఎంపికయ్యాడు. అతని పర్యవేక్షణలో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. అనూహ్యంగా శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్ కోల్పోయింది.

సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ చేజారింది. భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. అయితే టీమిండియా వరుస పరాజయాలకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పేలవ బ్యాటింగే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టీ20 ప్రపంచకప్ తర్వాత వారి బ్యాటింగ్ గణంకాలను పరిశీలిస్తే ఈ వాదన నిజమేననిపిస్తోంది. టీ20 ప్రపంచకప్ విజయానంతరం రోహిత్ శర్మ.. ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్లు ఆడి మూడు అర్థ సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు. ఇందులో రెండు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో సాధించినవే. అంతేకాకుండా ఈ 11 ఇన్నింగ్స్ల్లో ఐదు సార్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. ఈ 11 ఇన్నింగ్స్ల్లో అతని పరుగుల సగటు మరీ దారుణంగా 25.3గా ఉంది.
మరోవైపు విరాట్ కోహ్లీ కూడా ఇదే పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో 76 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ.. ఆ తర్వాత 11 ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ 11 ఇన్నింగ్స్ల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అది కూడా న్యూజిలాండ్తో ఇటీవల ముగిసన తొలి టెస్ట్.. రెండో ఇన్నింగ్స్లో చేసిందే.
ఈ 11 ఇన్నింగ్స్ల్లో మూడు సార్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. అతని సగటు కూడా రోహిత్ శర్మలానే 25.3గానే ఉంది. ఈ ఇద్దరి పేలవ ప్రదర్శనే టీమిండియా పరాజయాలకు కారణమనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కోహ్లీ, రోహిత్ కెరీర్లు చివరి దశలో ఉన్నాయనే విషయాన్ని ఈ గణంకాలు స్పష్టం చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.