హైదరాబాద్: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ, అతని సతీమణి రితికా సజ్డేలు నేడు 6వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం ఇదే రోజు తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నారు. అయితే రితికా విషయంలో రోహిత్ శర్మ.. టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువ రాజ్ సింగ్ నుంచి వార్నింగ్ ఎదుర్కొన్నాడట. రితికా తన చెల్లలని, మరోసారి ఆమె వైపు చూస్తే పగిలిపోద్దంటూ బెదిరించాడట. ఈ విషయాన్ని రోహిత్ శర్మనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
యువరాజ్ సింగ్ వద్ద రితికా సజ్డే స్పోర్ట్స్ మేనేజర్గా కొంతకాలం పనిచేసింది. ఈ క్రమంలోనే ఆమెను సోదరిగా భావించిన యువీ.. ఆమెతో రాఖీ కూడా కట్టించుకునేవాడు. అయితే ఓ సారి యాడ్ షూటింగ్ సందర్భంగా యువరాజ్, ఇర్ఫాన్ పఠాన్లతో కలసి రోహిత్ ఉండగా.. అక్కడికి రితికా వచ్చింది. అప్పుడే రితికాను రోహిత్ తొలిసారి చూశాడు. ఆమె అందం, అభినయాకి పడిపోయిన మనోడు అలాగే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఇది గమనించిన యువీ.. రోహిత్ శర్మను మందలించాడట. 'అలా చూడకు.. ఆమె నా చెల్లి'అని వార్నింగ్ ఇచ్చాడట. ప్రముఖ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్ యొక్క 'బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' షోలో రోహిత్ ఈ విషయాలను వెల్లడించాడు.
యువరాజ్ వార్నింగ్తో స్టన్ అయిన అతను.. కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశానని తెలిపాడు. యువరాజ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా రితికను రోహిత్ అదే విధంగా చూశాడంట. షూటింగ్ ముగిసిన తర్వాత ఆమె దగ్గరకు వెళ్లి మాటలు కలిపాడట. ఏదైనా ప్రాబ్లెం ఉంటే నాకు చెప్పండి.. నేను చేసి పెడతాను అని అడిగాడట. అలా వారిద్దరి ప్రయాణం మొదలైంది. ఆ కొద్ది రోజులకు రోహిత్ దగ్గర స్పోర్ట్స్ మేనేజర్గా రితికా చేరడంతో వారి ప్రేమకు అడ్డంకి లేకుండా పోయింది.
ఇక ముంబైలోని బోరివాలి స్పోర్ట్స్ క్లబ్లో రితికాకు రోహిత్ మోకాళ్లపై కూర్చొని రింగ్ ఇచ్చి మరి ప్రపోజ్ చేశాడట. 11 ఏళ్ల వయసులో ఇదే స్పోర్ట్స్ కబ్ల్లో క్రికెటర్గా కెరీర్ను మొదలుపెట్టిన రోహిత్ శర్మ.. తన ప్రేమను కూడా ఇక్కడే తెలియజేశాడట. ఆ తర్వాత వారి పరిణయం వివాహ బంధానికి దారి తీసి 6 వసంతాలు పూర్తి చేసుకుంది. ఇక రోహిత్- రితికా ప్రస్తావన వచ్చినప్పుడల్లా యువీ ఎపిసోడ్ను అభిమానులు గుర్తు చేసుకుంటారు. ఇక రోహిత్ శర్మ కన్నా ముందు రితికా.. విరాట్ కోహ్లీ దగ్గర కూడా మేనేజర్గా పనిచేసింది.