టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో నవ్వులు పూయిస్తోంది. పక్కనే టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన మాటలతో మరింత నవ్వులు పూయించాడు. భారత ఆటగాళ్లు, కెమెరామెన్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఈ వీడియో వైరల్గా మారింది.
టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభానికి ముందు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ ముగియకముందే రోహిత్ శర్మ సారథ్యంలోని కొందరు ఆటగాళ్లు అమెరికాకు వెళ్లారు. అక్కడ వామప్ మ్యాచ్లు ఆడారు. ఈ సందర్భంగా టీమ్ హోటల్ బాల్కానీలో రోహిత్ శర్మ తన ఒళ్లు విరుచుకుంటుండగా కెమెరామెన్ ఫొటోలు తీసే ప్రయత్నం చేశాడు.

ఇది చూసి రోహిత్..'ప్రశాంతంగా ఒళ్లు కూడా విరుచుకోనివ్వరా... ఒళ్లు విరుస్తుంటే కూడా ఫొటోలు తీయడం ఏంటి?'అని ప్రశ్నించాడు. వెంటనే పక్కన ఉన్న రిషభ్ పంత్ ఫొటో బాగా తీయాలని సూచించాడు. దాంతో నవ్వు ఆపుకోలేకపోయినా కెమెరామెన్.. మీరే చెప్పండి మంచిగా ఎలా తీయాలో? నేను తీస్తాను అని అడిగాడు. వెంటనే నువ్వు సూపర్ బ్రదర్.. అంటూ రోహిత శర్మను చూపిస్తూ ఇది ఒకేనా అని అడిగాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.
టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజేతగా నిలవగా.. కొంతమంది నెటిజన్లు ఈ వీడియోను మళ్లీ వైరల్ చేశారు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 ప్రపంచకప్ 2024ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా అద్భుత ప్రదర్శన విజయం సాధించింది.
బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ అసాధారణ ప్రదర్శన కనబర్చగా.. బౌలింగ్లో బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా నిప్పులు చెరిగారు. ఫీల్డింగ్లో సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ విజయంతో టీ20 ఫార్మాట్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా తప్పుకున్నారు. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు.