ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 229 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. రోహిత్ శర్మ(50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 81) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. జానీ బెయిర్ స్టో(22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 47), సూర్యకుమార్ యాదవ్(20 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 33), హార్దిక్ పాండ్యా(9 బంతుల్లో 3 సిక్స్లతో 22 నాటౌట్) దూకుడుగా ఆడారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ ఇచ్చిన రెండు సునాయస క్యాచ్లను నేలపాలు చేయడం గుజరాత్ టైటాన్స్కు నష్టం చేసింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(2/53), సాయి కిషోర్(2/42) రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/37) ఓ వికెట్ పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో ముంబై బ్యాటర్లు 17 సిక్స్లు, 14 ఫోర్లు కొట్టడం గమనార్హం.

అదిరిపోయే ఆరంభం..
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు అదిరిపోయే ఆరంభం దక్కింది. జానీ బెయిర్ స్టో విధ్వంసకర బ్యాటింగ్తో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు రోహిత్ శర్మ ఇచ్చిన రెండు సునాయస క్యాచ్లను నేలపాలు చేసిన గుజరాత్ ఫీల్డర్లు అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నారు. ప్రసిధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఇచ్చిన సునాయస క్యాచ్ను గెరాల్డ్ కోయిట్టీ వదిలేసాడు. సిరాజ్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే రోహిత్ శర్మ ఇచ్చిన మరో సునాయస క్యాచ్ను వికెట్ కీపర్ కుశాల్ మెండీస్ వదిలేసాడు. ఈ అవకాశాలతో రోహిత్ శర్మ చెలరేగాడు.
ప్రసిధ్ కృష్ణ వేసిన నాలుగో ఓవర్లో జానీ బెయిర్ స్టో మూడు సిక్స్లు, రెండు ఫోర్లతో 26 పరుగులు పిండుకున్నాడు. రోహిత్ కూడా బౌండరీల మోత మోగించడంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం సాయి సుదర్శన్-కోయిట్జీ స్టన్నింగ్ క్యాచ్ సాయంతో జానీ బెయిర్ స్టోను సాయి కిశోర్ పెవిలియన్ చేర్చాడు. దాంతో బెయిర్ స్టో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. తొలి వికెట్కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
రోహిత్ శర్మ విధ్వంసం..
క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ రాగా.. రోహిత్ శర్మ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గెరాల్డ్ కోయిట్జీ బౌలింగ్లో వరుసగా రెండు సిక్స్లు బాదిన సూర్య.. మూడో బంతికి క్యాచ్ ఇవ్వగా కీపర్ కుశాల్ మెండీస్ వదిలేసాడు. అయితే మరుసటి ఓవర్లోనే సాయి కిషోర్ సూర్యను పెవిలియన్ చేర్చాడు. తిలక్ వర్మతో కలిసి రోహిత్ దూకుడుగా ఆడుతూ సెంచరీ దిశగా సాగాడు. కానీ అతన్ని ప్రసిధ్ కృష్ణ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే తిలక్ వర్మ కూడా ఔటవ్వడంతో ముంబై పరుగుల వేగం తగ్గింది. నమన్ ధీర్ ఓ భారీ సిక్సర్ కొట్టి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. కోయిట్జీ వేసిన ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా మూడు సిక్స్లు కొట్టి 22 పరుగులు పిండుకున్నాడు.