
ముంబై: బ్యాటింగ్ వైఫల్యమే చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) చేతిలో తమ ఓటమికి ప్రధాన కారణమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా సొంతగడ్డపై శనివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ.. మరో 30-40 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు.
'మిడిల్ ఓవర్లలోనే మేం మూమెంటమ్ను కోల్పోయాం. అద్భుతమైన ఆరంభాన్ని అందిపుచ్చుకోలేకపోయాం. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. మిడిల్ ఓవర్లలో సరిగ్గా బ్యాటింగ్ చేయలేక 30-40 పరుగులు తక్కువగా చేశాం. చెన్నై స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. వరుసగా వికెట్లు తీస్తూ మా బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు.
ఇలాంటి పరిస్థితును విభిన్నమైన ఆటతో ధైర్యంగా ఎదుర్కొవాల్సి ఉంటుంది. మా జట్టులో సత్తా కలిగిన యువ ఆటగాళ్లు ఉన్నారు. అయితే వారికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంతో ప్రతిభ కలిగిన యువ ఆటగాళ్లకు మేం అండగా ఉంటూ వారి సామర్థ్యంపై నమ్మకం ఉంచుతున్నాం.
నాతో పాటు సీనియర్ ఆటగాళ్లంతా రాణించాల్సిన అవసరం ఉంది. ఐపీఎల్ స్వభావం ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ఒక్కసారి మూమెంటమ్ లభిస్తే దూసుకెళ్లవచ్చు. ఇదేం పెద్ద కష్టమేం కాదు. మేం ఓడింది రెండు మ్యాచ్లు మాత్రమే. విజయం సాధిస్తే అదే జోరును కొనసాగించవచ్చు. కానీ పరాజయం నుంచి విజయం అందుకోవాలంటే కష్టంగా ఉంటుంది.
పరిస్థితులన్నీ మారుతాయని ఆశిస్తున్నా. మిడిల్ ఓవర్లలో మేం అనుసరించిన వ్యూహాలు ఫలించలేదు. గత సీజన్లో మేం దారుణంగా విఫలమయ్యాం. కానీ ఆ పరాజయాలను మరిచి ఫ్రెష్గా ఈ సీజన్ను మొదలుపెట్టాం. మేం ఐదు టైటిళ్లు గెలిచినా.. ఏనాడు విజయ గర్వం ప్రదర్శించలేదు. టోర్నీలోని ప్రతీ జట్టు బలమైనదే. మేం మా అత్యుత్తమ ప్రదర్శనతో వారిని ఓడించాల్సిన అవసరం ఉంది.
ఈ రెండు మ్యాచ్లు మాకు అనుకూలంగా జరగలేదు. ఈ రెండు మ్యాచ్ల ఫలితాలను మేం మార్చలేం. కానీ ఈ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ధైర్యంగా ఉంటూ మైదానంలోని పరిస్థితులు మార్చాల్సిన అవసరం ఉంది.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసింది. ఇషాన్ కిషన్(21 బంతుల్లో 5 ఫోర్లతో 32), టీమ్ డేవిడ్(22 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా(3/20) మూడు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్పాండే, మిచెల్ సాంట్నర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై.. 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అజింక్యా రహానే(27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్(36 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 40 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ముంబై బౌలర్లలో బెహ్రెండార్ఫ్, పియూష్ చావ్లా, కుమార కార్తీకేయ తలో వికెట్ తీసారు.