
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్లు యుజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మల మధ్య సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. మాములుగానే చాలా ఫన్నీగా ఉండే క్రికెటర్లు.. తమ కోతి వేషాలతో ఫ్యాన్స్ను కడుపుబ్బా నవ్విస్తుంటారు. జట్టులో అల్లరిచేస్తూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ముఖ్యంగా చహల్ చేసే హడావుడి అంత ఇంతా కాదు. ఇక కరోనా పుణ్యమా.. ఇంటికే పరిమితమైన ఈ స్టార్ క్రికెటర్లు ఈ క్వారంటైన్ సమయాన్ని ఫ్యామిలీతో హాయిగా గడుపుతున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా ఫన్నీ కామెంట్స్తో ఫ్యాన్స్ను అలరిస్తున్నారు. ఇక ప్రతీ ఒక్కరి పోస్ట్పై సరదాగా కామెంట్ చేస్తూ వార్తల్లో నిలిచే చహల్... తాజాగా రోహిత్ను కదిలించాడు.
బుధవారం ముంబై ఇండియన్స్ ప్లేయర్లు బుమ్రా, రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఐపీఎల్ గురించి సీరియస్గా చర్చిస్తుండగా.. చహల్ ఎంటరయ్యాడు. 'బ్రదర్.. నేను లేనని ముంబై ఇండియన్స్ టీమ్ ఏమైనా బాధపడుతుందా?'అని ప్రశ్నించాడు. దీనికి హిట్మ్యాన్ కూడా అదే తరహాలో బదులిస్తూ ఈ సంభాషణ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెబుతామని అతనికి చెప్పండని చహల్ను పరోక్షంగా హెచ్చరించాడు. ఇక బుమ్రా అయితే.. 'నువ్వు మళ్లీ ముంబై ఇండియన్స్కు రావాలనుకుంటున్నావని మీ కెప్టెన్ కోహ్లీకి చెబుతాం.. 'అని బెదిరించాడు.
ఆ వెంటనే రోహిత్ స్ట్రాంగ్ ఆన్సర్తో చహల్ నోరు మూయించాడు. 'మేం గెలవకపోతే నువ్వు లేవని బాధపడాలి. కానీ మేం గెలిచాం. నువ్వు లేవని బాధపడాల్సిన అవసరం మాకు లేదు. చహల్.. నువ్వు ఆర్సీబీలోనే ఉండు. అదే నీకు సరైంది'అని సమాధానమిచ్చాడు.
ఇక చహల్ 2011,13 సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు. 2013లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఇక ఐపీఎల్లో ముంబై అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటికే ఆ జట్టు నాలుగు సార్లు టైటిల్ గెలిచింది. ఇక 2014లో ఆర్సీబీకి ఆడిన చహల్ ఆ సీజన్లో 12 వికెట్లతో అదరగొట్టాడు. ఆ జట్టు తరఫున 83 మ్యాచ్లు ఆడిన చహల్.. 99 వికెట్ల తన ఖాతాల వేసుకున్నాడు. ఇక కరోనా కారణంగా మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఏప్రిల్ 15కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్పై బీసీసీఐ ఎటు తేల్చుకోలేకపోతుంది.