ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు టీమిండియా తమ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను జాగ్రత్తగా చూసుకోవాలని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సూచించాడు. వినూత్నమైన యాక్షన్, వేగం వల్ల జస్ప్రీత్ బుమ్రా శరీరం అధిక ఒత్తిడికి గురవుతోందని తెలిపాడు. టీ20 ప్రపంచకప్లో భారత్ విజయం సాధించాలంటే బుమ్రా రాణించడం కీలకమని ఊతప్ప అభిప్రాయపడ్డాడు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా.. ఐదు టీ20ల సిరీస్ కోసం జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. వ్యక్తిగత కారణాలతో మూడో టీ20 ఆడలేదు. నాలుగో మ్యాచ్కు అందుబాటులో రాగా.. పొగమంచు కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది. తొలి టీ20 భారత్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. అహ్మదాబాద్ వేదికగా మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే ఐదో టీ20తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

తాజాగా మాట్లాడిన ఊతప్ప.. బుమ్రా వర్క్లోడ్ను జాగ్రత్తగా చూసుకోవాలని టీమిండియాకు సూచించాడు. 'బుమ్రా ఒక మ్యాచ్ విన్నర్. అతని వర్క్లోడ్ మేనేజ్మెంట్ను సరిగ్గా నిర్వహించాలి. క్రికెట్లో పేసర్లకు అనేక సవాళ్లు ఉంటాయి. పైగా బుమ్రాది వినూత్న బౌలింగ్ యాక్షన్. అలాగే వేగంగా బౌలింగ్ చేస్తాడు. ఈ కారణంగా అతని శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. బుమ్రాను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ సమయంలో అతను తగినంత క్రికెట్ ఆడేలా చూడాలి.
ఆటలో మనం అతని ప్రతిభను చూశాం. రానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అతను మరింత నిలకడగా రాణిస్తాడని ఆశిస్తున్నా. సౌతాఫ్రికా మంచి పోటీ ఇస్తోంది. కానీ ఈ టీ20 సిరీస్లో ఆశించిన రీతిలో రాణించలేదు. కానీ వారి బౌలింగ్ అద్భుతంగా ఉంది. కానీ బ్యాటింగ్ బాలేదు.
అహ్మదాబాద్ వేదికగా జరిగే ఆఖరి టీ20 రసవత్తరంగా సాగనుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమయం చేయాలని సౌతాఫ్రికా భావిస్తోంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా మెరుగైన ప్రదర్శన చేసింది. టెస్ట్ సిరీస్ను 2-0తో గెలిచింది. వైట్బాల్ క్రికెట్లోనూ గట్టి పోటీనే ఇచ్చింది. ఆఖరి మ్యాచ్ గెలిచి ఈ పర్యటను ముగించాలనే పట్టుదలతో ఉంది.'అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.