టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడి గురించి మాట్లాడి తప్పు చేశానని రాబిన్ ఊతప్ప అన్నాడు. రాయుడి గురించి మాట్లాడితే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిలేషన్ దెబ్బతిన్నదని చెప్పాడు. విరాట్ కోహ్లీపై బహిరంగ విమర్శలు చేసే ముందు అతనితో మాట్లాడి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆఖరి నిమిషంలో అంబటి రాయుడిని జట్టు నుంచి తప్పించి విజయ్ శంకర్ను తీసుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నిర్ణయంపై అంబటి రాయుడు బహిరంగంగానే విమర్శలు గుప్పించాడు. రాబిన్ ఊతప్ప సైతం జట్టు ఎంపికను తప్పుబడుతూ అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
అయితే అలా బహిరంగంగా విమర్శించే ముందు కోహ్లీతో మాట్లాడి ఉంటే బాగుండేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఊతప్ప చెప్పాడు. 'విరాట్ కోహ్లీ గురించి ఆ రోజు నేను చేసిన వ్యాఖ్యలు నిజమని నమ్మినప్పటికీ.. అలా మాట్లాడే ముందు వ్యక్తిగతంగా అతనితో మాట్లాడాల్సింది. ఆ వ్యాఖ్యల తర్వాత కోహ్లీతో నా రిలేషన్ దెబ్బతిన్నది. నేను ఏది నమ్మానో అదే అతనితో చెప్పాల్సింది. ఎప్పుడూ కూడా కోహ్లీతో నాకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడలేదు.

నా అత్యంత సన్నిహితుడైన స్నేహితుడికి (అంబటి రాయుడు) అతని నాయకత్వంలో ఎదురైన అనుభవం గురించే చెప్పాను. అతని నాయకత్వాన్నితప్పుబట్టలేదు. నాయకత్వ శైలిని మాత్రమే ఉద్దేశించి అన్నాను. ప్రతి ఒక్కరికీ వారి సొంత నాయకత్వ శైలి, అభిప్రాయాలు ఉంటాయి. ఒకే క్రీడా రంగంలో ఉన్నప్పుడు ఒకరినొకరు గౌరవించుకోవాలనే సున్నితమైన విషయాన్ని నేను ఆ ఘటన ద్వారా నేర్చుకున్నాను." అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.
విరాట్ కోహ్లీకి నచ్చకపోతే ఎంత పెద్ద ఆటగాడినైనా పక్కనపెట్టెస్తాడని అప్పట్లో రాబిన్ ఊతప్ప విమర్శలు గుప్పించాడు. అందుకు అంబటి రాయుడే సరైన ఉదాహరణ అని చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ కోసం జెర్సీలు, కిట్ బ్యాట్ సిద్ధం చేసుకున్న తర్వాత ఆఖరి నిమిషంలో తప్పించడం సమంజసం కాదని విమర్శించాడు. యువరాజ్ సింగ్ విషయంలోనూ ఇలానే చేశాడని, ఫిట్నెస్ టెస్ట్లతో ఇబ్బంది పెట్టాడని అప్పట్లో రాబిన్ ఊతప్ప విమర్శలు గుప్పించాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.