
న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పేరు పెట్టి పిలిచేది తానొక్కడినేనని టీమిండియా వెటరన్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. జట్టులోకి వచ్చిన కొత్తలో అందరూ మహీ భాయ్, ధోనీ సర్ అని పిలుస్తుంటే తాను కొంత గందరగోళానికి గురయ్యానని చెప్పాడు. ఇక ఎలా పిలవాలనేదానిపై ధోనీతో మాట్లాడానని గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబిన్ ఊతప్ప ఈ విషయాలు పంచుకున్నాడు.
'చెన్నైకి ఎంపికైనప్పుడు కొంత గందరగోళానికి గురయ్యాడు. దాదాపు 13-14 ఏళ్ల తర్వాత మాహీతో కలిసి ఆడాను. నేను టీమ్తో చేరిన తర్వాత అందరూ మాహీ భాయ్, మాహీ సార్ అని పిలుస్తున్నారు. నేను కాస్త అయోమయానికి గురయ్యా. వెళ్లి అతన్నే అడిగా. నేను నిన్ను మాహీ అని పిలవచ్చా? లేక మాహీ భాయ్ అని పిలవమంటావా? అని అడిగాను. అతను వెంటనే దీని గురించి అంత ఆలోచించకు. నువ్వు ఎలా పిలవాలనుకుంటే అలా పిలువు. నేను అప్పుడు ఎలా ఉన్నానో, ఇప్పుడు అలాగే ఉన్నాను. నాలో ఏ మార్పు రాలేదు. నువ్వు నన్ను మాహీ అనే పిలవచ్చని చెప్పాడు. టీమ్లో నేను ఒక్కడినే పేరుపెట్టి మాహీ అని పిలిచేవాడిని.
మా మధ్య అనుబంధం అలాంటిది. అది క్రికెట్కు మాత్రమే పరిమితమైంది కాదు. మేం కలిసి ఆడాం, కలిసి కబుర్లు చెప్పుకున్నాం. ఫీల్డ్లో కలిసి ఎమోషన్స్ షేర్ చేసుకున్నాం. మాకు బిడ్డ పుట్టిన వెంటనే ఆ ఫోటోని మాహీకి పంపాను... అతను వెంటనే 'పాప అచ్చు నీలాగే ఉంది.'అంటూ బదులిచ్చాడు. 13 ఏళ్ల క్రితం జట్టులో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో, ఇప్పటికే మేం ఇద్దరం కలిసి కూర్చొని ఛిల్ అవుతూ ఉంటాం.' అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.
గత 15 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న రాబిన్ ఊతప్ప... ముంబై ఇండియన్స్, పూణే వారియర్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా, చెన్నై జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 2014లో కోల్కత్తా నైట్రైడర్స్, 2021లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2020 సీజన్కి ముందు కేకేఆర్ నుంచి రాజస్థాన్ రాయల్స్ వచ్చిన రాబిన్ ఊతప్ప, ఆ సీజన్లో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. 2021 సీజన్కి ముందు క్యాష్ ట్రేడ్ ద్వారా సీఎస్కేలోకి వెళ్లాడు రాబిన్ ఊతప్ప... ప్లేఆఫ్స్ మ్యాచుల్లో సీనియర్ సురేష్ రైనాని కాదని రాబిన్ ఊతప్పని తుది జట్టులోకి తీసుకొచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, సూపర్ సక్సెస్ సాధించింది.
2021 నాకౌట్ మ్యాచుల్లో 3 మ్యాచుల్లో 110+ పరుగులు చేసిన ఊతప్ప, సీఎస్కే నాలుగో టైటిల్ గెలవడంతో తనవంతు పాత్ర పోషించాడు... ఈ పర్పామెన్స్ కారణంగానే 2022 ఐపీఎల్ మెగా వేలంలో ఊతప్పను రూ.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్... 2022 సీజన్లో 12 మ్యాచుల్లో 11 ఇన్నింగ్స్ల్లో ఊతప్ప 230 పరుగులు చేశాడు . ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.