ఐపీఎల్ 2026 మినీ వేలాన్ని ఆపేయాలని బీసీసీఐకి భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సూచించాడు. ఈ వేలం ప్రక్రియను ఆపేసి ఏడాది పాటు ఆటగాళ్లను ట్రేడ్ చేసుకునే అవకాశం కల్పించాలన్నాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఐపీఎల్లో మార్పులు చేయాలని తెలిపాడు. రెండున్నర నెలల పాటు నిర్వహిస్తున్న ఈ టోర్నీని 6 నెలల టోర్నీగా మార్చాలని సూచించాడు.
ఐపీఎల్లో కేకేఆర్కు ప్రాతినిథ్యం వహించిన రాబిన్ ఊతప్ప 205 మ్యాచ్లు ఆడి 4952 పరుగులు చేశాడు. 2014లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో రాబిన్ ఊతప్ప 660 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఐపీఎల్ గురించి మాట్లాడిన రాబిన్ ఊతప్ప.. లీగ్ స్వరూపాన్ని మార్చాలన్నాడు.

'ఐపీఎల్ టోర్నీని స్టార్టప్ దశకు మించి తీసుకెళ్లడం లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ లీగ్ ఇది. మారుతున్న కాలానికి అనుగుణంగా టోర్నీని మార్చాలి. వేలం ప్రక్రియను నిలిపేసి ఏడాది పాటు ట్రేడ్ విండో తెరిచి ఉంచాలి. వేలాన్ని పక్కన పెట్టి డ్రాఫ్ట్ సిస్టమ్ను తీసుకు రావాలి. నేను ఐపీఎల్ ఆడుతున్నప్పటి నుంచి ఈ విషయం చెబుతున్నా. కానీ వారు టీవీ వినోదం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.
డ్రాఫ్ట్ విధానం అంతకంటే గొప్పది కావొచ్చు. ఇది అభిమానులను ఆకట్టుకుంటుంది. దీన్ని అమలు చేయండి. అంతేకాకుండా ఐపీఎల్ 6 నెలల లీగ్లాగా ఉండాలని నేను భావిస్తున్నాడు. మధ్యలో అంతర్జాతీయ మ్యాచ్లను నిర్వహించాలి. కానీ, ఐపీఎల్ అభివృద్ధి చెందాలి'అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నారు.
డ్రాఫ్ట్ సిస్టమ్ అంటే ఆటగాళ్లను సమాన పద్దతిలో జట్లకు కేటాయించడానికి ఉపయోగించే విధానం. అత్యుత్తమ ప్రతిభను కనబర్చే క్రికెటర్లపై ఒక ఫ్రాంచైజీ గుత్తాధిపత్యం ఉండకుండా జట్ల బలబలాల మధ్య సమతుల్యం తీసుకురావడానికి దీన్ని ప్రవేశపెట్టారు. డ్రాఫ్ట్లో అర్హత ఉన్న ఆటగాళ్ల సమూహం నుంచి జట్లు వంతులవారీగా ఎంపిక చేసుకుంటాయి.