ముంబై, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లకే భారత జట్టులో సుస్థిర స్థారం ఉంటుందని టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్కు రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టిన ఊతప్ప.. ఈ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాడు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో రుతురాజ్ గైక్వాడ్కు అవకాశం దక్కలేదు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో సత్తా చాటాడు. కానీ గాయాలతో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు దూరమైన శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో రుతురాజ్ గైక్వాడ్ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. ఈ విషయంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు.

'మిత్రమా(రుతురాజ్ గైక్వాడ్).. సెలెక్టర్ల నిర్ణయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. అయినా మరింత కష్టపడటం కొనసాగించాలి. భారత క్రికెట్లో ఉన్న సవాళ్లలో ఇది కూడా ఒకటి అని గ్రహించాలి. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, పంజాబ్ వంటి ప్రధాన క్రికెట్ కేంద్రాల నుంచి రాకపోతే.. క్రికెటర్లు టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. 'అని రాబిన్ ఊతప్ప అన్నాడు.
మూడేళ్ల క్రితం (2022) తొలి వన్డే మ్యాచ్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లోనే భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ 9 మ్యాచ్ల్లో 28.50 సగటుతో 228 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీ నేపథ్యంలో సౌతాఫ్రికాతో ఇటీవల జరిగిన మూడు వన్డేల సిరీస్ల్లో రుతురాజ్ గైక్వాడ్కు అవకాశం దక్కింది.
తొలి వన్డేలో(8) విఫలమైన అతను రెండో వన్డేలో సెంచరీ(105)తో సత్తా చాటాడు. విశాఖ వేదికగా జరిగిన మూడో వన్డేలో అతనికి అవకాశం దక్కలేదు. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ గాయాల నుంచి కోలుకోని అందుబాటులో రావడంతో రుతురాజ్ గైక్వాడ్తో పాటు తిలక్ వర్మ ఉద్వాసనకు గురయ్యారు.
టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో బుమ్రా, హార్దిక్ పాండ్యాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించిన సెలెక్టర్లు.. మహమ్మద్ సిరాజ్ను ఎంపిక చేశారు. వెటరన్ పేసర్ మహమ్మద్ షమీని మరోసారి పట్టించుకోలేదు.