వైభవ్ సూర్యవంశీ అచ్చం ధోనీ లానే ఆడుతున్నాడు: రాబిన్ ఊతప్ప
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అచ్చం దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తరహాలోనే ఉందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. వైభవ్ సూర్యవంశీ సరికొత్త బ్యాటింగ్ టెక్నిక్ను పరిచయం చేశాడని, ధోనీ కూడా ఈ టెక్నిక్తోనే ఆడేవాడని గుర్తు చేశాడు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్తో మాట్లాడిన రాబిన్ ఊతప్ప.. వైభవ్ సూర్యవంశీ క్రీజులో డీప్గా బ్యాక్ఫుట్లో ఆఫ్స్టంప్కు కొద్దిగా బయటకు నిలబడి ఆడుతాడని, ధోనీ అప్రోచ్ కూడా ఇలానే ఉండేదని తెలిపాడు.
ధోనీలానే వైభవ్ టెక్నిక్..
'వైభవ్ సూర్యవంశీ విభిన్నమైన బ్యాటింగ్ టెక్నిక్ను అనుసరిస్తున్నాడు. ఇతర ఆటగాళ్లు కూడా ఫాలో అయ్యే బ్యాటింగ్ టెక్నిక్ను అతను కనుగొన్నాడు. అతను ఎక్కువగా ఫ్రంట్ ఫుట్కి వెళ్లకుండా బ్యాక్ ఫుట్లోనే ఉండి ఆడుతాడు. ఎంఎస్ ధోనీ కూడా ఇలానే ఆడేవాడు. బంతి కిందికి వచ్చే విధంగా బ్యాక్ఫుట్లో వేచి చూసి ఆడేవాడు. యార్కర్ బాల్స్ను భారీ షాట్స్గా ఆడాలంటే బ్యాటర్లకు ఉన్న ఏకైక ఆప్షన్ ఇదే.

వైభవ్ సూర్యవంశీ కొద్దిగా వంగి.. ఆఫ్స్టంప్కు కొంచెం బయట నిలబడుతాడు. తద్వారా బౌలర్ గుడ్ లెంగ్త్ బాల్ లేదా షార్ట్ పిచ్, బౌన్సర్ వేయాలని ఎదురు చూస్తుంటాడు. దాంతో బౌలర్లు ఏ ప్రదేశంలో బాల్ వేసినా.. అతనికి పరుగులు చేయడం సునాయసం అవుతుంది. కాబట్టి వైభవ్ పరిచయం చేసిన ఈ బ్యాటింగ్ టెక్నిక్ను యువ క్రికెటర్లు సునాయసంగా అనుకరించవచ్చు. అలవర్చుకోవచ్చు.'అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు.
స్ట్రైక్రేట్కు ఆరెంజ్ క్యాప్ ఇవ్వాలి..
ఐపీఎల్లో అత్యధిక పరుగులకు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ను ఇక నుంచి అత్యుత్తమ స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాడికి ఇవ్వాలని రాబిన్ ఊతప్ప సూచించాడు. కనీస పరుగుల నిబంధనను కొనసాగిస్తూనే.. స్ట్రైక్ రేట్కు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.
'ఇకపై అత్యధిక పరుగులు చేసినందుకు కాకుండా.. అత్యుత్తమ స్ట్రైక్రేట్ కోసం క్యాప్ ఇవ్వాలి. ఎవరైనా 350 నుంచి 400 వరకు పరుగులు చేసి.. అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగి ఉంటే, వారికి ఆరెంజ్ క్యాప్ ఇవ్వాలి. గతంలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న విధానం ఇప్పుడు కాలం చెల్లింది. గేమ్ ఈ విధంగానే మారాలి.'అని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

