న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంపై చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మెగా వేలం జరిగిన తీరును చూస్తుంటే సంతలో పశువుల అమ్మకాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుందన్నాడు. ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీపడుతుంటే.. ఏదో వస్తువు కోసం పోటీ పడుతున్నట్లు అనిపిస్తుందని, వేలం సమయంలో ఆటగాళ్లు కూడా మనుషులేనన్న విషయాన్ని ఫ్రాంచైజీలు మరిచిపోయి ప్రవర్తిస్తాయని వాపోయాడు.
వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఎవరూ ఊహించలేరని, అది వర్ణించలేని బాధ కలిగిస్తుందని అన్నాడు. ఆటగాళ్ల కోసం వేలం భారత్లో మాత్రమే జరుగుతుందని, భవిష్యత్తులోనైనా ఈ ప్రక్రియకు స్వస్థి పలికితే బాగుంటుందని, అందరికీ మేలు జరిగేలా ముసాయిదా విధానం అమలులోకి వస్తే చాలా గౌరవప్రదంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
కాగా, ఐపీఎల్ 2022 మెగా వేలంలో రాబిన్ ఉతప్పను చెన్నై సూపర్ కింగ్స్ అతని కనీస ధర రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గత సీజన్లో కూడా అతను ఇదే జట్టుకు ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా ధోనీ జట్టులో చేరాడు. వరుసగా విఫలమైన అతను అసలు సిసలు ఫైనల్లో దుమ్మురేపాటు. కెప్టెన్ ధోనీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దాంతోనే అతన్ని చెన్నై మళ్లీ కొనుగోలు చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్టుకు ఆడాలన్నది తన కోరిక అని, అందు కోసం తాను, తన కొడుకు దేవుడిని ప్రార్ధించామని ఓ ఇంటర్వ్యూలో ఊతప్ప పేర్కొన్నాడు. రాబిన్ ఉతప్ప 2006 నుంచి 2015 మధ్యకాలంలో భారత్ తరఫున 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు.