
జైపూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్లో ఇండియా లెజెండ్స్ జోరు కొనసాగుతోంది. వెస్టిండీస్ లెజెండ్స్తో జరుగుతున్న సెమీఫైనల్లో దిగ్గజ బ్యాట్స్మన్, కెప్టెన్ సచిన్ టెండూల్కర్(42 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లతో 65) మెరుపు హాఫ్ సెంచరీ సాధించగా.. మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్(20 బంతుల్లో 1ఫోర్, 6సిక్సర్లతో 49 నాటౌట్ ) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దాంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోర్ చేసింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 35) మెరుపు ఆరంభమివ్వగా.. చివర్లో యూసఫ్ పఠాన్(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 37 నాటౌట్) చెలరేగాడు. వెస్టిండీస్ లెజెండ్స్ బౌలర్లలో టినో బెస్ట్ రెండు వికెట్లు తీయగా.. ర్యాన్ ఆస్టిన్ ఓ వికెట్ పడగొట్టాడు.
టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఇండియా లెజెండ్స్ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ శుభారంభాన్ని అందించారు. బౌండరీలే లక్ష్యంగా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిని సెహ్వాగ్ స్కోర్ బోర్డ్ను పరుగెత్తించాడు. అదే జోరులో అతను రిటర్న్ క్యాచ్గా వెనుదిరిగడంతో తొలి వికెట్కు నమోదైన 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మహ్మద్ కైఫ్తో సచిన్ ధాటిగా ఆడాడు. కైఫ్ ఔటైనా.. యూసఫ్ పఠాన్ సాయంతో రఫ్ఫాడించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఆఖర్లో బ్యాటింగ్కు వచ్చిన యువీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విండీస్ లెజెండ్స్ బౌలర్ నగముటూ వేసిన 19వ ఓవర్లో యువీ ఏకంగా నాలుగు సిక్సర్లు బాది 24 రన్స్ పిండుకున్నాడు. అతని ధాటైన ఇన్నింగ్స్తో అభిమానులను అలరించాడు.
ఇక 2019 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ లెజెండ్స్ కూడా ధాటిగానే ఆడుతుంది. పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 84 బంతుల్లో 148 పరుగులు చేయాల్సి ఉంది.