
న్యూఢిల్లీ: సచిన్ కళాత్మక కవర్ డ్రైవ్లు... సెహ్వాగ్ అప్పర్ కట్ షాట్లు.. పఠాన్ సూపర్ స్వింగర్లు.. వాయువేగంతో దూసుకెళ్లే జహీర్, అగార్కర్ బంతులు.. పక్షిలా ఎగిరి బంతిని అందుకునే మహ్మద్ కైఫ్ ఫీల్డింగ్ మెరుపులు.. ఇవన్నీ మధుర జ్ఞాపకాలు..! అభిమానుల మదిలో చెరగని ముద్రవేసిన ఇలాంటి అపురూప దృశ్యాలు మరోసారి కళ్ల ముందు సాక్షాత్కారం కానున్నాయి..! క్రికెట్కు వీడ్కోలు పలికిన మహామహులు మరోసారి మైదానంలో తలపడేందుకు సిద్ధమయ్యారు...!
వయసు మీద పడ్డా రెట్టించిన ఉత్సాహంతో పోటీకి సై అననున్నారు..! టెస్టులు, వన్డేల్లో తమ ఆటతో క్రికెట్కే వన్నె తెచ్చిన ఆటగాళ్లు.. పొట్టి ఫార్మాట్లో పోటీ పడనున్నారు..! రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వ రోడ్డు భద్రతా విభాగం.. అన్ అకాడమీ ఫ్రోఫెషనల్ మేనేజ్మెంట్ గ్రూప్ సంయుక్తంగా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2020-21 విజయవంతంగా నిర్వహించింది.
ఈ టోర్నీ రెండో సీజన్కు లైన్ క్లియరైంది. మే నెలాఖరులో టోర్నీ ప్రారంభం కానుందని నిర్వహకులు ప్రకటించారు. నిజానికి ఈ టోర్నీ ఈ నెలలోనే జరగాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదా పడింది. హైదరాబాద్, విశాఖపట్నం, లక్నో, ఇండోర్ వేదికలుగా మ్యాచ్లు జరగుతాయని.. జూన్లో హైదరాబాద్ వేదికగా ఫైనల్ జరగనుందని నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ను విడుదల చేస్తామని నిర్వహకులు స్పష్టం చేశారు.
రోడ్ సేఫ్టీ సిరీస్ మొదటి సీజన్లో పాల్గొన్న బంగ్లాదేశ్ ఆటగాళ్లకు నిర్వహకులు ఇంకా ఫీజు చెల్లించకపోవడంపై ఆటగాళ్లకు అసంతృప్తితో ఉన్నట్లు అక్కడి మీడియా ఇటీవల వెల్లడించింది. అయితే మాజీ ఆటగాడు రజిన్ సాలేహ్ విడుదల చేసిన వీడియోతో ఈ సమస్య పరిష్కారమైనట్లు తెలుస్తోంది. నిర్వహకులు తనకు బాకీ ఉన్న ఫీజును చెల్లించారని ఆ వీడియోలో అతను పేర్కొన్నాడు. అవకాశం వస్తే ఈ టోర్నీలో ఈసారి ఆడేందుకు సిద్ధమని చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్లో భారత్ సహా ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటాయి.