న్యూఢిల్లీ: జనాలు తనను అంతగా ఎందుకు ద్వేషిస్తున్నారో అర్థం కావడం లేదని రాజస్థాన్ రాయల్స్ యువ ప్లేయర్ రియాన్ పరాగ్ అన్నాడు. తాను తుమ్మినా.. దగ్గినా ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల ముగిసిన దేవదర్ ట్రోపీలో అసాధారణ ప్రదర్శన కనబర్చిన రియాన్ పరాగ్.. 5 మ్యాచ్ల్లో 88.50 సగటుతో 354 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.
బౌలింగ్లో కూడా సత్తా చాటిన రియాన్ పరాగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ పెర్ఫామెన్స్ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాలతోనే తాను దేవదర్ ట్రోఫీలో రాణించగలిగానని చెప్పాడు.

'ఎన్ని తప్పులు చేసినా.. మన ప్రక్రియను ఆపవద్దని, మరింత కష్టపడాలని కోహ్లీ భయ్యా సూచించాడు. ఇది నాకు చాలా ఉపయోగపడింది. నాపై జనాలకు ఎందుకు అంత ద్వేషమో అర్థం కావడం లేదు. నేను చూయింగ్ గమ్ నమిలినా వాళ్లకు సమస్యే.. నా కాలర్ పైకి ఉన్నా వాళ్లకు ఇబ్బందే. క్యాచ్ పట్టిన తర్వాత సెలబ్రేట్ చేసుకున్నా విధానాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు.
చివరకు ఖాళీ సమయంలో గోల్ఫ్ ఆడుతున్నా .. విమర్శిస్తున్నారు. జనాలు.. నన్ను ఇంతగా ట్రోల్ చేయడానికి కారణం ఏంటో నాకు తెలీదు. అయితే జనాలు అనుకునే రూల్ బుక్కు నేను విరుద్దంగా ఉన్నాననే ద్వేషిస్తున్నారనిపిస్తోంది. వారి రూల్ బుక్లో టీ షర్ట్ టక్ వేసుకుని ఉండాలి. కాలర్ కిందికే ఉండాలి. అందర్నీ గౌరవించాలి.
ఎవ్వరినీ సెడ్జ్ చేయకూడదన్నట్లు ఉంటే వీళ్లకు కరెక్టుగా ఉంటుందేమో. నేను ఇవన్నీ చేయను కాబట్టి నన్ను ద్వేషిస్తున్నారు. క్రికెట్ను నా సరదా కోసమే ఆడుతున్నాను. అయితే నేను ఈ స్థాయికి చేరుకోవడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.
నేను ఈస్థాయి ఆటగాడిని కాదని వాళ్లు భావిస్తున్నారు. నాపై వచ్చే ట్రోల్స్ను చూసి మా అమ్మ షాక్ అవుతూ ఉంటోంది. ఆమెకు నేను ఒక్కటే చెప్పాను. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నాను. నేను ఈ విషయాలను పట్టించుకోవడం పూర్తిగా మానేసాను.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2023 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రియాన్ పరాగ్ దారుణంగా విఫలమయ్యాడు.