తన వైఫల్యం వల్లే గెలిచే మ్యాచ్లో ఓటమిపాలయ్యామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. తాను ఇంకాసేపు క్రీజులో ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్)తో ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. మరోసారి సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రియాన్ పరాగ్.. 95 పరుగులు చేసిన తర్వాత కూడా ఓటమి పాలవ్వడం బాధగా ఉందని చెప్పాడు. ఈ ఓటమికి తానే బాధ్యుడినని తెలిపాడు.
నేనే ముగించాల్సింది..
'చివరి వరకు క్రీజులో ఉండాలని నేను ప్రణాళికలు వేసుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు 18వ ఓవర్లో ఔటయ్యాను. నాదే తప్పు. చివరి 6 ఓవర్లలో మేం సరైన బౌలింగ్ ఆప్షన్స్ ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ బౌలర్పై నేను ఫిర్యాదు చేయడం లేదు. ఇది కూడా నా తప్పిదమే. ఏది ఏమైనా ఈ లక్ష్యాన్ని మేం చేధించాల్సింది. మేం ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేయాల్సింది. రస్సెల్ తొలి 10 బంతుల్లో 2 పరుగులే చేశాడు. ఆ తర్వాత వేగంగా బ్యాటింగ్ చేశాడు. అతని బ్యాటింగ్ చూడ ముచ్చటగా అనిపించింది. ఈ గెలుపు క్రెడిట్ అతనిదే.
సిక్స్లు కొట్టేందుకు అనువైన మైదానం ఇది. వికెట్ కాస్త ట్రిక్కీగా కూడా ఉంది. దాంతో నేను ప్లాన్ ప్రకారం నా షాట్స్ ఆడాను. నేను మెరుగ్గానే బ్యాటింగ్ చేశాను. కానీ మ్యాచ్ను గెలిపించలేకపోయాను. ఇది నన్ను మరింత బాధకు గురి చేసింది. ఈ రోజు మేం సమష్టి ప్రదర్శన చేయలేకపోయాం. అందుకే ఓటమిపాలయ్యాం. ఈ ఓటమికి నేను కూడా ఓ బాధ్యుడిని'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.

6 బంతుల్లో 6 సిక్స్లు..
ఈ మ్యాచ్లో రియాన్ పరాగ్ వరుసగా 6 బంతుల్లో 6 సిక్స్లు బాదాడు. మోయిన్ అలీ బౌలింగ్లో చివరి 5 బంతులను సిక్సర్లుగా తరలించిన పరాగ్.. వెంకటేశ్ అయ్యర్ వేసిన మరుసటి ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి బంతి సిక్సర్ కొట్టి ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. రియాన్ పరాగ్ చెలరేగినా దురదృష్టవశాత్తు రాజస్థాన్ రాయల్స్కు విజయం సాధించలేదు.
రస్సెల్ విధ్వంసం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్(25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 57 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అంగ్క్రిష్ రఘువంశీ(31 బంతుల్లో 5 ఫోర్లతో 44), రెహ్మానుల్లా గుర్బాజ్(25 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రింకూ సింగ్(6 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 19 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యధ్వీర్ సింగ్, మహీష్ తీక్షణ, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులే చేసి ఓటమిపాలైంది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా, మోయిన్ అలీ రెండేసి వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.