గుండె ఆగినంత పనైంది.. అతని సలహాతోనే గట్టెక్కాం: రియాన్ పరాగ్
ధ్రువ్ జురెల్ ఇచ్చిన సలహాతోనే ఓడిపోయే మ్యాచ్లో విజయం సాధించామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. జోఫ్రా ఆర్చర్తో 19వ ఓవర్ వేయించాలని తనకు చెప్పిందే జురెల్ అని, ఈ క్రెడిట్ పూర్తిగా తనదేనని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం అహ్మదాబాద్ వేదికగా ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది.
చివరి 2 ఓవర్లలో రాజస్థాన్ విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. 19వ ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్ 4 పరుగులే ఇచ్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఆఖరి ఓవర్లో తుషార్ దేశ్ పాండే 4 పరుగులే ఇచ్చి రాజస్థాన్ విజయాన్ని లాంఛనం చేశాడు.
గుండె ఆగినంత పనైంది
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రియాన్ పరాగ్.. చివర్లో ఉత్కంఠతో గుండె ఆగినంత పనైందని తెలిపాడు. చివర్లో తాము రిస్క్ తీసుకున్నామని, అది ఫలించిందని చెప్పాడు. 'ఆఖరి రెండు ఓవర్లు నిజంగా అద్భుతం. మేం ఒక రిస్క్ తీసుకున్నాం. బంతి ఫుల్ లెంగ్త్లో వేయాలని నిర్ణయించుకున్నాం. మా బౌలర్లు ఈ ప్లాన్ను పక్కాగా అమలు చేశారు. వారు అనుకున్న విధంగా బౌలింగ్ చేయడం చూసి నేను చాలా ఉత్సాహానికి లోనయ్యాను.
నిజానికి నేను బౌలింగ్ ఆర్డర్ను మార్చాలనుకున్నాను. కానీ ఆ క్రెడిట్ అంతా ధ్రువ్ జురెల్కే దక్కుతుంది. 19వ ఓవర్ జోఫ్రాతోనే వేయించమని అతను నాకు సలహా ఇచ్చాడు. ఆ చివరి రెండు ఓవర్లలో బంతిని సాధ్యమైనంత వేగంగా.. యార్కర్లు సంధించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం.

టైటిల్ గెలిపిస్తాడు..
ఈ టోర్నీ కోసం ధ్రువ్ జురెల్ చాలా కష్టపడ్డాడు. గతంలో అతను 6, 7వ స్థానాల్లో బ్యాటింగ్ చేసేవాడు. ఇప్పుడు మూడో స్థానంలో ఆడే అవకాశం వచ్చింది. అతను ఖచ్చితంగా 3వ స్థానంలోనే బ్యాటింగ్ చేయాలని మొదట చెప్పింది నేనే. ఈ సీజన్లో అతను 700-800 పరుగులు సాధించి, మాకు టైటిల్ గెలిపిస్తాడని ఆశిస్తున్నా'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
గట్టెక్కిన రాజస్థాన్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 55), ధ్రువ్ జురెల్(42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 75) హాఫ్ సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ(18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 31) దూకుడుగా ఆడాడు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబడా(2/42) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.
అనంతరం గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 204 పరుగులే చేసి ఓటమిపాలైంది. సాయి సుదర్శన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 73) హాఫ్ సెంచరీతో రాణించినా.. చివర్లో రషీద్ ఖాన్(16 బంతుల్లో 3 ఫోర్లతో 24), కగిసో రబాడ(16 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 23 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవి బిష్ణోయ్(4/41) నాలుగు వికెట్లు తీసి గుజరాత్ టైటాన్స్ పతనాన్ని శాసించాడు. నండ్రే బర్గర్, రియాన్ పరాగ్, తుషార్ దేశ్పాండేకు తలో వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications