ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ వేదికగా మంగళవారం ముగిసిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 371 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకోలేకపోయింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు ఐదు సెంచరీలు నమోదు చేశారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ శతకాలతో పాటు పంత్ రెండు ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు సాధించాడు. అయినా భారత్కు ఓటమి తప్పలేదు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్లోనే ఐదుగురు బ్యాటర్లు సెంచరీ చేసిన తర్వాత ఓడిన జట్టుగా భారత్ చెత్త రికార్డ్ నమోదు చేసింది.
అయితే రిషభ్ పంత్ సెంచరీ చేయడం వల్లే టీమిండియా ఓడిపోయిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. విదేశాల్లో రిషభ్ పంత్ సెంచరీ చేసిన ప్రతీసారి భారత్ గెలవలేదని గుర్తు చేస్తున్నారు. 2018లో ఇంగ్లండ్ గడ్డపై పంత్ సెంచరీ చేయగా ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. 2019లో ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ సాధించగా.. ఈ మ్యాచ్ డ్రా అయ్యింది. 2022లో సౌతాఫ్రికాపై, అదే ఏడాది ఇంగ్లండ్పై సెంచరీ చేయగా.. ఈ రెండు మ్యాచ్ల్లో టీమిండియా ఓడింది. తాజా మ్యాచ్ల్లో రెండు శతకాలు నమోదు చేయగా.. భారత్కు ఓటమి తప్పలేదు. విదేశీ గడ్డపై 6 సార్లు సెంచరీ చేయగా.. ఐదింటిలో ఓటమి ఎదురైందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 465 పరుగులు చేయడంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 364 పరుగులు చేసింది. దాంతో ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసి గెలుపొందింది. బెన్ డకెట్(170 బంతుల్లో 21 ఫోర్లు, సిక్స్తో 149) సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(126 బంతుల్లో 7 ఫోర్లతో 65), జోరూట్(84 బంతుల్లో 6 ఫోర్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.