టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ మరోసారి తన తెలివిని ప్రదర్శించాడు. గాయం డ్రామాతో ప్రత్యర్థి టీమ్ జోరుకు బ్రేక్ వేసాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో రిషభ్ పంత్ గాయం డ్రామా ఆడాడు. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ దూకుడుగా ఆడుతూ సెంచరీకి చేరువ్వవగా.. పంత్ బ్రేక్ తీసుకొని మూమెంటమ్ బ్రేక్ చేశాడు. ఆ వెంటనే హ్యారీ బ్రూక్ ఔటై సెంచరీని చేజార్చుకున్నాడు.
సిరాజ్ వేసిన 86వ ఓవర్ అనంతరం పంత్.. మోకాలి నొప్పి అంటూ ఫిజియోలను పిలిచాడు. దాంతో అంపైర్లు డ్రింక్స్ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత బుమ్రా బంతిని అందుకోగా.. క్రిస్ వోక్స్ బౌండరీ బాదాడు. ఈ ఓవర్ మొత్తం అతనే ఆడాడు. ప్రసిద్ కృష్ట వేసిన 88వ ఓవర్లో హ్యారీ బ్రూక్.. తొలి బంతికి క్విక్ డబుల్ తీసి 99 పరుగులకు చేరుకున్నాడు. రెండో బంతిని డాట్ చేసిన అతను మూడో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి మూల్యం చెల్లించుకున్నాడు. శార్దూల్ ఠాకూర్కు క్యాచ్ ఇచ్చిన వెనుదిరిగాడు. సరిగ్గా 99 పరుగుల వద్దే అతను ఔటయ్యాడు. రిషభ్ పంత్ బ్రేక్తోనే అతని ఏకాగ్రత దెబ్బతిన్నదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. పంత్ అతి తెలివిని మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం నిజంగానే పంత్ మోకాలిలో నొప్పి కలగవచ్చని కామెంట్ చేస్తున్నారు.

పంత్ ఇలా గాయం డ్రామా ఆడటం ఇదే తొలిసారి కాదు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లోనూ పంత్ ఇలానే ఇంజ్యూరీ డ్రామా ఆడి సౌతాఫ్రికా జోరుకు బ్రేక్ వేసాడు. అప్పటి వరకు దూకుడుగా ఆడిన హెన్రీచ్ క్లాసెన్.. పంత్ ఇంజ్యూరీ డ్రామా తర్వాత ఔటయ్యాడు. దాంతో టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024ను కైవసం చేసుకుంది.
ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. 6 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 23.5 ఓవర్లలో 2 వికెట్లకు 90 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(47 బ్యాటింగ్)తో పాటు కెప్టెన్ శుభ్మన్ గిల్(6 బ్యాటింగ్) ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 96 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. నాలుగో రోజు తొలి సెషన్ ఆట మ్యాచ్ ఫలితాన్ని శాసించనుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 465 పరుగులకు ఆలౌటైంది.