
న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతను ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది.
దీంతో వాహనంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైంది. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా హరిద్వార్ జిల్లాలో మంగళూరు, నర్సన్ మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఇయర్ వేడుకలకు హాజరై తన తల్లికి సప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో తన రాక గురించి సమాచారం ఇవ్వకుండా పంత్ వచ్చినట్లు తెలుస్తోంది.
స్వయంగా కారు డ్రైవ్ చేసిన పంత్.. నిద్రపోతూ కారు నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పంత్ ఒక్కడే కారులో ఉన్నాడని, కారు అద్దాలను పగలగొట్టుకొని బయటకు వచ్చాడని చెప్పారు. 'హరిద్వార్ జిల్లాలో మంగళూరు-నర్సన్ మధ్యలో రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వెంటనే అతన్ని రూర్కీ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి మ్యాక్స్ ఆసుపత్రికి తరలించాం.'అని చెప్పారు.
రిషభ్ పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.. తల, లెగ్తో పాటు వీపు భాగంలో గాయలయ్యానని పేర్కొంది. అతని కాలు కూడా విరిగినట్లు తెలుస్తోంది. పంత్ ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అతని తల్లి సరోజ్ పంత్ ఆసుపత్రికి చేరుకున్నారు. గాయాలతో ఉన్న కుమారుడిని చూసి బోరున విలపించారు. గత 3-4 రోజులుగా ఇంటికి రావాలని పంత్ను కోరినట్లు ఆమె మీడియాకు తెలిపారు. పంత్ వచ్చే విషయాన్ని తమకు చెప్పలేదని ఏడుస్తూ చెప్పారు.
పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడనే వార్తలతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్కు గురైంది. అభిమానులతో పాటు దిగ్గజ ఆటగాళ్లు, స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ పంత్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
ఇక తల్లికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న పంత్.. షాకిచ్చాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. డ్రైవర్తో రావాల్సిందని కామెంట్ చేస్తున్నారు. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లు డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ రోడ్డుప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.