
రాజ్కోట్ : టీమిండియా యువ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కెరీర్కు ప్రమాదం తెచ్చిపెట్టేలా ఉంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో రాహుల్ బ్యాటింగ్, కీపింగ్లో అదరగొడుతున్నాడు. ఏ స్థానంలో బ్యాటింగ్కు పంపినా పరుగులు సాధిస్తున్నాడు. ఇక తొలి వన్డేలో పంత్ గాయపడి కంకషన్ గురవడంతో కీపింగ్ బాధ్యతలు చేపట్టిన రాహుల్.. వికెట్ల వెనకాల పంత్కు మించి రాణిస్తున్నాడు. ముఖ్యంగా రెండో వన్డేలో ఫించ్ రెప్పపాటు స్టంప్ఔట్, మరో రెండు క్యాచ్లతో కీపింగ్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనిని గుర్తు చేశాడు.
అతని పెర్ఫామెన్స్కు ముగ్ధులైన అభిమానులు సోషల్ మీడియావేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతేకాకుండా మరో ధోని అంటూ ఆకాశానికెత్తుతున్నారు. ఇక పంత్ను పక్కకుపెట్టండని బీసీసీఐకు సలహాలు కూడా ఇస్తున్నారు. ఫన్నీమీమ్స్తో పంత్ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. డీఆర్ఎస్లో కూడా కచ్చితమైన అభిప్రాయాన్ని చెబుతూ ఉండటంతో రాహుల్ కీపర్గా ఫిట్ అయ్యాడని, ఇక పంత్ను సాగనంపాలంటూ కామెంట్లు పెడుతున్నారు. మూడో వన్డేలో కూడా రాహుల్ రాణిస్తే పంత్ను పక్కకు పెట్టే అవకాశం ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక రెండో వన్డేలో భారత్ 36 రన్స్ తేడాతో గెలిచి సిరీస్ను 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్లో శిఖర్ ధావన్(98), కోహ్లీ(78), కేఎల్ రాహుల్(80), రోహిత్ శర్మ (42) రాణించగా బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో కోహ్లీ సేన సునాయస విజయాన్నందుకుంది. డిసైడర్ వన్డే బెంగళూరు వేదికగా ఆదివారం జరగనుంది.