టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆటలో బంతిని మార్చాలని రిషభ్ పంత్ చేసిన విన్నపాన్ని అంపైర్ తిరస్కరించాడు. దాంతో సహనం కోల్పోయిన పంత్.. బంతిని నేలకుకొట్టాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 61వ ఓవర్ అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ ముగియగానే బంతిని అంపైర్ వద్దకు తీసుకెళ్లిన పంత్.. ఆకారం దెబ్బతిన్నదని ఫిర్యాదు చేశాడు. దాంతో అంపైర్ తన వద్ద ఉన్న పరికరంతో బంతి ఆకారాన్ని పరీక్షించాడు. బాగానే ఉందని, బంతిని మార్చాల్సిన అవసరం లేదని చెప్పాడు. దాంతో అసహనానికి గురైన పంత్.. అంపైర్పై కోపంతో బంతిని నేలకు కొట్టాడు. పంత్ రియాక్షన్కు అంపైర్ అవాక్కయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా బంతిని మార్చాలని అంపైర్ను కోరగా.. మరోసారి పరీక్షించిన అంపైర్ అవసరం లేదని చెప్పాడు. అంపైర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన పంత్పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.

209/3 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ ఆదిలోనే సెంచరీ హీరో ఓలీ పోప్(106) వికెట్ను కోల్పోయింది. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్లో పోప్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్(18)తో కలిసి హ్యారీ బ్రూక్(35 బ్యాటింగ్) ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నారు. ఈ ఇద్దరూ నిలకడగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్..తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(101), శుభ్మన్ గిల్(147), రిషభ్ పంత్(134) సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, బెన్ స్టోక్స్ నాలుగేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ తీసారు.