
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలోని భారత జట్టులో కరోనా కలకలం రేపింది. ఇప్పటికే ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు ఎవరనే విషయాన్ని టీమ్ వర్గాలు వెల్లడించలేదు. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్కు వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఐసోలేషన్లో ఉన్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలను బీసీసీఐ ధృవీకరించాల్సి ఉంది.
8 రోజుల క్రితమే రిషభ్ పంత్కు కరోనా పాజిటీవ్ అని తేలిందని, ప్రస్తుతం అతనికి ఎలాంటి లక్షణాలు లేవని, రేపు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారని స్పోర్ట్స్ థక్ చానెల్ పేర్కొంది.
మరోవైపు కరోనా బారిన ఇద్దరు భారత ఆటగాళ్లలో ఒకరికి కరోనా పూర్తిగా తగ్గిందని ప్రముఖ వార్త సంస్థ ఏఎన్ఐ తెలిపింది. మరొకరికి వచ్చే ఆదివారం పరీక్షలు జరుపుతారని పేర్కొంది. కరోనా బారిన ఇద్దరు ప్లేయర్లకు పెద్దగా లక్షణాలు లేవని, కొద్దిగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.
'ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కరోనా బారిన పడిన ఓ ఆటగాడు పూర్తిగా కోలుకున్నాడు. మరో ప్లేయర్ ఐసోలేషన్లో ఉన్నాడు. ఆదివారం అతనికి మరోసారి కరోనా టెస్ట్ చేయనున్నారు. అతనికి ఎలాంటి లక్షణాలు లేవు. నెగటీవ్ రిపోర్ట్ వస్తుందనే ధీమాతో మేమంతా ఉన్నాం.'అని టీమ్కు చెందిన ఓ అధికారి తెలిపారు. టీమ్ వర్గాలను హెచ్చరిస్తూ బీసీసీఐ సెక్రటరీ జై షా లేఖ రాసినట్లు తెలుస్తోంది. బయో బబుల్ నిబంధనలను కఠినంగా పాటించాలని అందులో పేర్కొన్నట్లు సమాచారం. విరాట్ కోహ్లీ నేతృత్వంలో 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి అనంతరం ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్కు ఆరు వారాల సమయం ఉండటంతో బీసీసీఐ భారత ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది.
దాంతో బయో బబుల్ ధాటిన ఆటగాళ్లు ఈ విరామ సమయాన్ని ఆస్వాదించారు. ఇంగ్లండ్ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. వింబుల్డన్, యూరో 2020 మ్యాచ్లను తిలకించారు. రిషభ్ పంత్ యూరో ఫుట్బాల్ మ్యాచ్లకు హాజరయ్యాడు. లండన్లోని తన స్నేహితులతో విరామ సమయాన్ని ఆస్వాదించాడు. ఈ క్రమంలోనే అతను వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను తన సన్నిహితుల ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది.