ఊర్వశితో ప్రేమాయణం..
వీళ్లిద్దరు పీకల్లోతూ ప్రేమలో మునిగితేలుతున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలోనే రిషభ్ పంత్ ఈ పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టాడు. సోషల్ మీడియాలో ఊర్వశి రౌటెలాను బ్లాక్ చేసి తమ మధ్య ఏం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అప్పట్లో ఇది మీడియాలో పెద్ద సెన్సేషనల్ వార్తగా మారింది. ఆ కొద్ది రోజులకే రిషభ్ పంత్, ఇషా నేగి అనే మోడల్తో ప్రేమలో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చాడు. దాంతో ఊర్వశి రౌటెలాకు పంత్ మధ్య ఏం లేదనే క్లారిటీ వచ్చింది. అయితే ఊర్వశి రౌటెలా మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా పంత్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూనే ఉంది.
పంత్ నా కోసం వెయిట్ చేశాడు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేరు చెప్పుకుండా రిషభ్ పంత్తో తనకు ఎక్కడ తేడా వచ్చిందనే విషయాన్ని ఊర్వశి బయటపెట్టింది. 'వారణాసిలో నేను ఓ మూవీ షూటింగ్లో పాల్గొన్నా. అక్కడి నుంచి న్యూఢిల్లీకి ఓ షోలో పాల్గొనడానికి ఫ్లైట్ ఎక్కి వచ్చా. న్యూఢిల్లీలో రోజంతా షూటింగ్లో పాల్గొన్నా. మళ్లీ ఆ తర్వాతి రోజు ఫ్లైట్ పట్టుకుని, వారణాసికి వెళ్లాలి. ఆ సమయంలో నన్ను కలవడానికి అతను (మిస్టర్ ఆర్పీ) వచ్చాడు. నేను ఉంటున్న హోటల్కు వచ్చి లాబీలో వెయిట్ చేశాడు. నాకు ఆ విషయం తెలీదు. అతను వచ్చిన 10 నిమిషాల ముందే నేను షూటింగ్ నుంచి హోటల్కు వచ్చి బాగా అలిసిపోయి పడుకున్నా.
ఫోన్ ఎత్తకపోవడంతో..
అతను వచ్చిన విషయం కానీ, నా కోసం వెయిట్ చేస్తున్న విషయం కానీ నాకు తెలీదు. అప్పుడు నాకు ఫోన్ వచ్చింది. కానీ ఆ రింగ్ కూడా నాకు వినిపించలేదు. అంతలా అలిసిపోయి మత్తుగా పడుకున్నా. లేచి చూసేసరికి 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను చాలా ఫీల్ అయ్యా.. నా కోసం అతను అంతలా వెయిట్ చేయాల్సి వచ్చిందని బాధపడ్డాను. వెంటనే ఫోన్ చేసి, ముంబై వచ్చాక కలుస్తానని చెప్పాను. చెప్పినట్టే ముంబైకి వెళ్లినప్పుడు కలిసాను. అయితే ఆ తర్వాతే ఏం జరిగిందో తెలీదు కానీ అతను నాతో మాట్లాడటం మానేసాడు. దానిపై మీడియా రకరకాలుగా రాసుకొచ్చింది. మీడియా వార్తల వల్ల కూడా మా మధ్య దూరం పెరిగింది.' అంటూ ఊర్వశి రౌటెలా తమ బ్రేకప్కు గల కారణాన్నిచెప్పుకొచ్చింది.
పాపులారిటీ కోసం పచ్చి అబద్దాలు
ఈ వాఖ్యలు సోషల్ మీడియా వేదికగా సెన్సేషన్ కావడంతో రిషభ్ పంత్ స్పందించాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఊర్వశి పేరు ప్రస్తావించకుండా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'కొందరు ఫేమ్, పాపులారిటీ కోసం ఇంటర్వ్యూల్లో ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతారో అర్థం కాదు. కేవలం వార్తల్లో నిలిచేందుకు ఇలా చేస్తారంటే ఫన్నీగా ఉంది. పేరు కోసం, ఫేమ్ కోసం ఇంతగా పాకులాడే వారిని చూస్తుంటే బాధగా ఉంటుంది. వాళ్లకి దేవుడి ఆశీస్సులు ఉండాలి. ' అని ఇన్స్టా స్టోరీలో పంత్ రాసుకొచ్చాడు. పరోక్షంగా తన గురించి ఊర్వశీ చెప్పింది పచ్చి అబద్దమని పంత్ తెలియజేశాడు.