టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయంతోనే బ్యాటింగ్కు దిగాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో జట్టు కోసం ఒంటి కాలితో బ్యాటింగ్ చేస్తున్నాడు. బుధవారం మాంచెస్టర్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో రిషభ్ పంత్ కుడి పాదానికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రిషభ్ పంత్ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి నేరుగా అతని కుడి పాదానికి బలంగా తాకింది. దాంతో తీవ్ర గాయమై రక్త స్రావం కావడంతో పాటు పాదం వాచిపోయింది. దాంతో నేల మీద పాదం పెట్టేందుకు రిషభ్ పంత్ అల్లాడిపోయాడు. గోల్ఫ్ కార్ట్ అంబులెన్స్ సాయంతో రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు.
రిషభ్ పంత్ నొప్పితో విలవిలలాడటంతో అతను మళ్లీ బ్యాటింగ్ చేయడంపై అనేక సందేహాలు నెలకొన్నాయి. పంత్ కాలి వేలికి ఫ్రాక్చర్ అయ్యిందని, ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని కూడా వార్తలు వచ్చాయి. 6 వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారని నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారాన్ని పటా పంచల్ చేస్తూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రిషభ్ పంత్ గాయంపై కీలక ప్రకటన చేసింది. వికెట్ కీపింగ్కు దూరమైనా జట్టు అవసరాల మేరకు బ్యాటింగ్ చేస్తాడని తెలిపింది.

'మాంచెస్టర్ టెస్ట్ తొలి రోజు ఆటలో గాయపడిన రిషభ్ పంత్ ఈ మ్యాచ్లో వికెట్ కీపింగ్ చేయడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేస్తాడు. రిషభ్ పంత్ కుడి పాదానికి గాయమైనా.. జట్టు అవసరాల మేరకు రెండో రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తాడు.'అని బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ ప్రకటన వెలువడిన నిమిషాల వ్యవధిలోనే రిషభ్ పంత్ బ్యాటింగ్కు దిగాడు. ఆరో వికెట్గా శార్దూల్ ఠాకూర్ వెనుదిరగ్గా.. పంత్ బ్యాటింగ్ వచ్చాడు.
తీవ్ర నొప్పితో కుంటుతూనే బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ సాయంతో ఆచితూచి ఆడుతున్నాడు. నిలబడటానికే ఇబ్బంది పడుతున్న పంత్.. జట్టు కోసం ఒంటి కాలితో బ్యాటింగ్ చేస్తున్నాడు. పంత్ కమిట్మెంట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పంత్ ఫైటర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. గాయంతోనూ బ్యాటింగ్ చేసేందుకు సిద్దమైన పంత్కు ప్రేక్షకులు, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఘన స్వాగతం పలికారు. లేచి నిలబడి చప్పట్లతో వెల్కమ్ చెప్పారు. పంత్ పోరాటాన్ని అభినందించారు.
264/4 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలో గట్టి షాక్ తగిలింది. ఓవర్నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా(20) ఒకే ఒక్క పరుగు చేసి ఆర్చర్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్తో కలిసి శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడారు. 6వ వికెట్కు 48 పరుగులు జోడించిన అనంతరం శార్దూల్ ఠాకూర్(41) స్టోక్స్ పెవిలియన్ చేర్చాడు. దాంతో పంత్ బ్యాటింగ్కు రావాల్సి వచ్చింది. మరో వికెట్ పడకుండా పంత్, సుందర్ జాగ్రత్తగా ఆడి తొలి సెషన్ను ముగించారు. దాంతో భారత్ 321/6 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.