
న్యూఢిల్లీ: ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. శుక్రవారం నడక కూడా మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పంత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ ఫొటోల్లో పంత్ వాకింగ్ స్టిక్ సాయంతో ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తున్నాడు. ఈ ఫొటోలకు 'ఒక్క అడుగు ముందుకు.. ఒక్క అడుగు బలంగా.. ఒక్క అడుగు మెరుగ్గా'అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఇక డిసెంబర్ 30న రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టి అగ్నికి ఆహుతి అయిన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో వైద్యులు పంత్కు మొకాలీ సర్జరీతో పాటు పలు శస్త్రచికిత్సలు చేశారు. కొద్ది రోజుల తర్వాత పంత్ను డిశ్చార్జ్ చేయగా అతను కోలుకుంటున్నాడు.
పూర్తిగా కోలుకొని మైదానంలోకి అడుగుపెట్టడానికి పంత్కు కనీసం ఏడాది సమయం పట్టనుంది. దాంతో అతను టీమిండియా ఆడుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్తో పాటు ఐపీఎల్, వన్డే ప్రపంచకప్ వంటి మెజర్ టోర్నీలకు దూరమయ్యాడు. ఆటకు దూరమైన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్లోనే ఉంటున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన పంత్.. ఆ తర్వాత బాల్కనీ నుంచి తీసి ఒక ఫొటోనూ షేర్ చేశాడు. దానికి స్వచ్చమైన గాలిని పీలుస్తుంటే హాయిగా ఉందంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పుడు నడకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేయడంతో అతని అభిమానులు సంతోషపడుతున్నారు.