టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా నెట్స్లో పూర్తి స్థాయి ప్రాక్టీస్ ప్రారంభించాడు. బ్యాటింగ్తో పాటు కీపింగ్, ఫీల్డింగ్ సాధన మొదలు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రిషభ్ పంత్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.
చేతి కర్ర సాయంతో నడవడం మొదలుపెట్టిన తాను ఇప్పుడు మైదానంలో పరుగెత్తుతున్నానని తెలుపుతూ ఈ వీడియోకు క్యాప్షన్గా పేర్కొన్నాడు. ఈ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ సైతం ఎక్స్వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది. రిషభ్ పంత్ కోలుకోవడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పంత్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. 2022 డిసెంబర్ 30న రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నూతన ఏడాది తన కుటుంబ సభ్యులకు సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఒంటరిగా తన మెర్సిడెస్ కారులో ఢిల్లీ నుంచి ఉత్తరఖాండ్లోని రూర్కీ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అతివేగంతో అదుపు తప్పిన కారు డివైడర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. పంత్ కారు అద్దాలు పగలగొట్టుకొని బయటపడ్డాడు. ఈ ఘటనలో అతని తల మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి. వీపు భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో పంత్ కారు పూర్తిగా దగ్దమవ్వగా.. అతన్ని చూసిన జనాలు.. మళ్లీ క్రికెట్ ఆడటం కష్టమని భావించారు.
పలు శస్త్ర చికిత్సలు చేయించుకున్న పంత్.. పూర్తిగా కోలుకున్నాడు. ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్తో మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్లో మునపటిలా సత్తా చాటితే టీమిండియాకు ఎంపికవ్వనున్నాడు. రిషభ్ పంత్ లేని లోటును పరిమిత ఓవర్ల క్రికెట్లో రాహుల్, ఇషాన్ కిషన్ తీర్చినా.. టెస్ట్ల్లో మాత్రం భర్తీ కాలేదు. రిషభ్ పంత్ లేని లోటు స్పష్టంగా కనబడుతోంది.
డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో రిషబ్ పంత్ ఉండి ఉంటే టీమిండియా విజయం సాధించేది. లోయర్ మిడిలార్డర్లో ధాటిగా ఆడగలిగే బ్యాటర్ జట్టులో ఎవరూ లేరు.