
న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్తో తనకు ఎలాంటి పోటీ లేదని స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అన్నాడు. అసలు ఆ విషయం గురించి ఏ మాత్రం ఆలోచించనని చెప్పాడు. ఎవరికి అవకాశం వచ్చినా జట్టు విజయం కోసం 100 శాతం ప్రయత్నిస్తామని చెప్పాడు.
లేటు వయసులో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దినేశ్ కార్తీక్ ఊహకందని ప్రదర్శనలతో అలరిస్తున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీ తరఫున క్షణాల్లో మ్యాచ్ ఫలితాన్ని మార్చేసి ఫినిషర్గా సత్తా చాటిన కార్తీక్.. కెరీర్ చివరి దశలో టీమిండియాలోకి వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. జట్టులో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి వికెట్ కీపర్లు ఉన్నా రిషభ్ పంత్తో అతను మాత్రమే పోటీపడుతున్నాడు.
ఈ ఇద్దరూ కలిసి మ్యాచులు ఆడుతున్న సందర్భాలూ ఉన్నాయి. రాబోయే టీ20 ప్రపంచకప్ లో ఈ ఇద్దరిలో ఎవరు ఆడతారు..? అనేదానిపై చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తామిద్దరిలో టీ20 ప్రపంచకప్ ఆడేదెవరో తేల్చేశాడు. 'అసలు మా ఇద్దరి మధ్య ఎలాంటి పోటీ లేదు. మేం ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. పోటీగా కాదు గానీ వ్యక్తిగతంగా మేమిద్దరం మ్యాచ్లో వంద శాతం బెస్ట్ ఇచ్చేందుకు ఆడతాం. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మిగిలిన విషయాలు నా చేతుల్లో లేవు. ఎవరు ఆడతారు..? ఎవరు జట్టులో ఉండాలనేది కెప్టెన్, హెడ్ కోచ్ నిర్ణయిస్తారు. ఎవరు ఆడటం ద్వారా జట్టుకు ఉపయోగం ఉంటుందనేది వారితో పాటు జట్టు మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.' అని తెలిపాడు.
టీ20 క్రికెట్లో బంతుల వ్యవధిలో ఫలితాన్ని తారుమారు చేయగల సామర్థ్యం పంత్, కార్తీక్లకు ఉంది. వెస్టిండీస్ సిరీస్ లో ఈ ఇద్దరూ కలిసే ఆడారు. అంతకుముందు దక్షిణాఫ్రికా తో స్వదేశంలో జరిగిన సిరీస్ లో సైతం సంయుక్తంగా బరిలోకి దిగారు. అయితే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జట్టులోకి రావడంతో ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే ఆడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఎవరికి అవకాశం దక్కుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.