ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తనను ఏదో శక్తి కాపాడిందని టీమిండియా వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. రోడ్డు ప్రమాదం తర్వాత వైద్యులు తన కాలు తీసేస్తారని భయపడ్డానని చెప్పాడు. 2022 డిసెంబర్ 30న అర్థ రాత్రి ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్.. ఏడాదిన్నరగా ఆటకు దూరమయ్యాడు.
2023 నూతన సంవత్సరానికి తన కుటుంబ సభ్యులకు సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన బీఎండబ్ల్యూ కారులో ఢిల్లీ నుంచి రూర్కీ బయలు దేరిన రిషభ్ పంత్ ఘోర ప్రమాదానికి గురయ్యాడు.

అతివేగంతో కారు నడిపిన అతను నిద్రమత్తులో డివైడర్ను ఢీకొట్టాడు. ప్రమాద ధాటికి కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైంది. అటుగా వెళ్తున్న ఇతర వాహనదారులు రిషభ్ పంత్ను కారులో నుంచి బయటకు లాగి రక్షించారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను పలు శస్త్ర చికిత్సలు చేసుకొని పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో బరిలోకి దిగేందుకు బీసీసీఐ మంగళవారమే అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో అతను ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ క్యాంప్లో చేరాడు. ఈ సందర్భంగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఏదో శక్తి కాపాడినట్టు అనిపించింది. ఇంతకు మించిన ఘోర ప్రమాదాన్ని ఊహించలేను. ప్రమాదం జరిగినప్పుడు నా కాలు నరాలు దెబ్బతిన్నాయేమోనని భయపడ్డాను. నా కాలు తొలగించడం గురించి డాక్టర్లు కూడా నాతో మాట్లాడారు. కానీ ఆ దేవుడు నాకు అండగా నిలిచాడు.
ఆధ్యాత్మికంతో ఉంటే మరింత క్రమశిక్షణతో ఉండవచ్చు. అయితే ఈ విషయంలో ఎవరి ఛాయిస్ వారిది. నా ఫిట్నెస్పై ఏకాగ్రత పెట్టడానికి ఆధ్యాత్మికంతో ఉండటం నాకు ఉపయోగపడింది.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
రిషభ్ పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించడంపై ఢిల్లీ క్యాపిటల్స్ సంతోషం వ్యక్తం చేసింది. జట్టులోకి ఘన స్వాగతం పలికింది. 'పుతి తిరిగివచ్చింది. గర్జించడానికి సిద్ధంగా ఉంది. రిషభ్ పంత్కు ఘన స్వాగతం నీ ఆటను చూసేందుకు వేచి ఉండలేం'అని పేర్కొంది. ఐపీఎల్ 2024 సీజన్కు మార్చి 22న తెరలేవనుండగా.. మార్చి 23న పంజాబ్ కింగ్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ ఆడనుంది.