రోడ్డు ప్రమాదం కారణంగా నరకం చూశానని టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తెలిపాడు. అసలు తాను ప్రాణాలతో ఉంటాననే అనుకోలేదన్నాడు. రెండు నెలల వరకు బ్రెష్ చేయలేదని చెప్పాడు. 2022 డిసెంబర్ 30న రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
కొత్త ఏడాది తన తల్లికి సప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఢిల్లీ నుంచి సొంత కారులో రూర్కీ బయలు దేరిన రిషభ్ పంత్.. నిద్రమత్తులో డివైడర్ను ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో రిషభ్ పంత్కు తీవ్ర గాయాలయ్యాయి. అతని బీఎండబ్ల్యూ కారు పూర్తిగా దగ్దమైంది. రోడ్డుపై అటుగా వెళ్తున్న ఇతర ప్రయాణీకులు రిషభ్ పంత్ను రక్షించారు.

ఈ ప్రమాదంతో రిషభ్ పంత్ 15 నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్తో మైదానంలోకి అడుగుపెట్టాడు. రీఎంట్రీలో మునపటిలా సత్తా చాటి.. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటికే అమెరికాకు చేరుకున్న పంత్.. తాజాగా టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ హోస్ట్గా వ్యవహరించిన ఓ షోలో తన ప్రమాదానికి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'రోడ్డు ప్రమాదం నా జీవితాన్ని పూర్తిగా మార్చింది. ఆ సమయం ఎంతో అనుభవంతో పాటు జీవితం విలువను తెలియజేసింది. తీవ్ర గాయాల కారణంగా ప్రాణాలతో ఉంటానో లేదో అనిపించింది. ఏడు నెలల పాటు నరకం చూశాను. భరించలేని నొప్పిని అనుభవించాను. దాదాపు రెండు నెలలు బ్రష్ చేసుకోలేకపోయాను.
ఎయిర్పోర్ట్కు కూడా వెళ్లలేకపోయాను. ఎందుకంటే వీల్ ఛైర్లో కూర్చొని బయటి వ్యక్తులను చూడటం ఇబ్బందిగా అనిపించింది. చాలా భయంగా ఉండేది. కానీ, భగవంతుడు నన్ను రక్షించాడు. నాకు మరో అవకాశాన్ని ఇచ్చాడు.'అని రిషభ్ పంత్ భావోద్వేగానికి గురయ్యాడు.
ఐపీఎల్ 2024 సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన రిషభ్ పంత్ 40.55 సగటుతో 446 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్గా 11 క్యాచ్లు పట్టడంతో పాటు 5 స్టంపౌట్స్ చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా పదే పదే స్లో ఓవర్ రేట్కు కారణమైన రిషభ్ పంత్పై ఐపీఎల్ నిర్వాహకులు ఓ మ్యాచ్ నిషేధం విధించారు. దాంతో ఆర్సీబీతో జరిగిన కీలకపోరుకు పంత్ దూరం కావాల్సి వచ్చింది. అతని గైర్హాజరీ ఢిల్లీని ఓటమిని శాసించింది.