న్యూఢిల్లీ: 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో జట్టుకు అవసరమైన కీలక సమయంలో తాను ఔటైనప్పుడు గుండె పగిలినట్లనిపించిందని టీమిండియా వికెట్కీపర్ రిషభ్ పంత్ అన్నాడు. భారత్కు విజయాలు అందించడం కన్నా గొప్పేముంటుందని, ఆసీస్ గడ్డపై సిరీస్ విజయంలో తాను కీలక పాత్ర పోషించడం ఎంతో సంతోషానిచ్చిందని చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మానసికంగా ధృడమయ్యేందుకు లాక్డౌన్ తనకు ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు.
'2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో జట్టుకు అవసరమైన కీలక సమయంలో ఔటవ్వడం చాలా బాధకు గురిచేసింది. ఆ క్షణాన నా గుండె పగిలినట్లనిపించింది. అలాంటి అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందా? అని ప్రతీ రోజు అనుకేనేవాడిని. అసాధారణ ప్రదర్శనతో కఠిన పరిస్థితుల్లో ఉన్న జట్టుకు విజయాలు సాధించాలని నేనెప్పుడూ కలలు కనేవాడిని. ఎన్ని పరుగులు చేశానన్నది ముఖ్యం కాదు. అవి జట్టు గెలుపునకు ఉపయోగపడ్డాయా? లేదా? అనేదే ప్రధానం. బ్రిస్బేన్ టెస్టులో అందుకే చివరి వరకూ క్రీజులో ఉండాలనుకున్నా.
సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో 97 పరుగులకు ఔటైనపుడు కూడా చివరి వరకూ నిలవలేకపోయానని బాధపడ్డా. అందుకే చివరి టెస్టులో మాత్రం ఆ పొరపాటు మళ్లీ చేయొద్దని అనుకున్నా. సుందర్తో ఆడుతున్నపుడు మా ఇద్దరిలో ఒకరు నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నడిపిస్తే.. మరొకరు భారీ షాట్లు ఆడాలనుకున్నాం. నేను షాట్లు ఆడతానంటే సుందర్ కూడా అదే పని చేస్తానన్నాడు. చివరికి అతనే ఆ బాధ్యత తీసుకున్నాడు. కానీ ఆఖర్లో నేను షాట్లు ఆడాల్సి వచ్చింది" అని పంత్ చెప్పుకొచ్చాడు.
ఇక మానసికంగా బలంగా మారేందుకు లాక్డౌన్ తనకు ఉపయోగపడిందని ఈ యువ వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు. 'లాక్డౌన్ నాకు వరంగా మారిందనే చెప్పొచ్చు. దాని కంటే ముందు ఎక్కువ ఒత్తిడికి లోనయ్యేవాణ్ని. కానీ ఆ సమయంలో కుటుంబంతో, స్నేహితులతో గడపడం వల్ల ప్రశాంతత కలిగింది. ఇప్పుడు కాస్త పరిణతి సాధించానని అనిపిస్తోంది. నా ఆటతీరులో కొన్ని మార్పులు చేసుకున్నా. సానుకూల దృక్పథంతో ఉండి, కష్టపడితే కచ్చితంగా ఫలితం వస్తుందని గ్రహించాను'అని పంత్ పేర్కొన్నాడు.