సమయాన్ని వృథా చేయాలనే వ్యూహంలో భాగంగానే జస్ప్రీత్ బుమ్రాతో ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కొన్స్టాస్ గొడవకు దిగాడని టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అన్నాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఆఖరి టెస్ట్ తొలి రోజు ఆట చివర్లో బుమ్రా-కొనస్టాస్ గొడవపడ్డారు.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతి వేసేందుకు బుమ్రా సిద్దమవ్వగా.. స్ట్రైకింగ్లో ఉన్న ఉస్మాన్ ఖవాజా పక్కకు జరిగాడు. దీంతో బుమ్రా ఏమైంది అంటూ.. కాస్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందుకు నాన్ స్ట్రైకర్గా ఉన్న కొన్స్టాస్ బదులివ్వడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లేందుకు సిద్దమవ్వగా అంపైర్లు జోక్యం చేసుకొని వారించారు. ఈ ఓవర్ చివరి బంతికే ఉస్మాన్ ఖవాజా ఔటవ్వగా.. భారత ఆటగాళ్లు కొన్స్టాస్ లక్ష్యంగా సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

ఈ మ్యాచ్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(98 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 40), రవీంద్ర జడేజా(95 బంతుల్లో 3 ఫోర్లతో 26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.చివర్లో బుమ్రా(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 22) విలువైన పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్బోలాండ్(4/31) నాలుగు వికెట్లతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్(3/49) మూడు వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్(2/37) రెండు వికెట్లు దక్కాయి. నాథన్ లయన్ ఓ వికెట్ తీసాడు.
అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా(3) విఫలమవ్వగా.. సామ్ కోన్స్టాస్(7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. తొలి రోజు ఆట అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న రిషభ్ పంత్కు బుమ్రా-కొన్స్టాస్ గొడవకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. సమయాన్ని వృథా చేయాలనే ఉద్దేశంతోనే ఆసీస్ ఓపెనర్లు అలా వ్యవహరించారని పంత్ బదులిచ్చాడు.
'నాకు తెలిసి సమయాన్ని వృథా చేయాలని ఆసీస్ ఓపెనర్లు భావించారు. జస్ప్రీత్ బుమ్రాతో సామ్ కొన్స్టాస్ గొడవపడటానికి కారణం కూడా ఇదేనని నేను భావిస్తున్నా. అతను ఏదో అన్నాడు. ఏం అన్నాడో నాకు వినిపించలేదు. కానీ ఆ సమయంలో నాకు అనిపించింది ఏందంటే.. మేం మరో ఓవర్ వేయకుండా సమయాన్ని వృథా చేయాలని భావించారని అర్థమైంది.'అని రిషభ్ పంత్ పేర్కొన్నాడు.