Rishabh Pant: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ఉన్నప్పుడు అప్పటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తరుచూ తనతో మాట్లాడేవాడని వికెట్ కీపర్ రిషభ్ పంత్ గుర్తు చేసుకున్నాడు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసేవాడని తెలిపాడు. ఆసుపత్రిలో తాను లేవలేని స్థితిలో మంచంపై పడుకున్నప్పుడు కూడా తమ మధ్య సంభాషణ చాలా సరదాగా ఉండేదని చెప్పాడు. 'డోంట్ వర్రీ రోహిత్ భాయ్.. నేను త్వరలోనే జట్టులోకి వస్తాను, ప్రపంచకప్ గెలిపిస్తాను'అని చెప్పేవాడనని, ఆ మాటలకు రోహిత్ నవ్వేవాడని పంత్ చెప్పుకొచ్చాడు.
2022 అక్టోబర్ 31న రిషభ్ పంత్కు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కొత్త ఏడాది తన కుటుంబ సభ్యులకు సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఒక్కడే ఢిల్లీ నుంచి స్వస్థలానికి బయల్దేరిన రిషభ్ పంత్కు ఊహించని ప్రమాదం ఎదురైంది. నిద్రమత్తు, అతివేగం కారణంగా డివైడర్ను ఢీకొట్టిన కారు అగ్నికి ఆహుతైంది. ఓ బస్సు డ్రైవర్, కండక్టర్ రిషబ్ పంత్ను రక్షించారు.

ఈ ప్రమాదంతో ఏడాది పాటు ఇంటికే పరిమితమైన పంత్.. సరిగ్గా టీ20 ప్రపంచకప్ 2024 ముందు టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. మెగా టోర్నీలోనూ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఫైనల్లో సౌతాఫ్రికా మూమెంటమ్ను దెబ్బతీయడానికి అతను ఆడిన ఇంజ్యూరీ డ్రామా టీమిండియాకు కలిసొచ్చింది.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రిషభ్ పంత్.. రోడ్డు ప్రమాదంతో ఆసుపత్రిపాలైన గడ్డు రోజులను గుర్తు చేసుకున్నాడు. 'నేను గాయపడి ఆసుపత్రిలో ఉన్నప్పుడు రోహిత్ భాయ్తో తరచూ మాట్లాడుతూ ఉండేవాడిని. అప్పుడు ఆయనతో ఒకే మాట చెప్పాను. రోహిత్ భాయ్.. అస్సలు కంగారు పడకండి. నేను మళ్ళీ గ్రౌండ్లోకి అడుగుపెట్టిన తర్వాత, మన దేశం కోసం ఒక ఐసీసీ ట్రోఫీని గెలిపించి మీకు ఇస్తాను. అది నా బాధ్యత. నా మాటలు విని రోహిత్ భాయ్ నవ్వుకునేవాడు.
Rishabh Pant said, “when I was injured and in the hospital, I used to say to Rohit Sharma that, ‘Rohit bhai, don’t worry. Whenever I’ll be back on the field, I’ll win an ICC trophy’”. pic.twitter.com/G3fpai2Z7j
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 5, 2026
ఆసుపత్రి బెడ్పై ఉన్నప్పుడు భారత జట్టు మ్యాచ్లు చూడటం నాకు చాలా కష్టంగా ఉండేది. నేను అక్కడ ఉండి జట్టుకు సహాయం చేయలేకపోతున్నానని బాధపడేవాడిని. రోహిత్ భాయ్ నా ఆరోగ్యం గురించి తరుచూ ఆరా తీసేవారు. ఆయన నాపై ఉంచిన నమ్మకమే నేను త్వరగా కోలుకోవడానికి ఒక కారణం.
నేను మళ్ళీ క్రికెట్ ఆడగలనా లేదా అని చాలా మంది సందేహించారు. కానీ నా మనసులో మాత్రం ఒక్కటే ఉండేది.. అది కేవలం తిరిగి రావడం మాత్రమే కాదు, భారత్ను విజేతగా నిలబెట్టాలని కలలు కనేవాడిని. రోడ్డు ప్రమాదం తర్వాత జీవితంపై నా ధృక్పథం పూర్తిగా మారిపోయింది.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయం తర్వాత టెస్ట్ ఫార్మాట్కు పరిమితమైన రిషభ్ పంత్.. టీ20ల్లో చోటు కోల్పోయాడు. దాంతోనే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.