భారత అభిమానుల ప్రార్థనల వల్లనే టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలిచిందని స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అన్నాడు. డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్తో ప్రపంచకప్ చేజారిందని భయపడ్డానని, కానీ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో అడ్డుకున్నాడని గుర్తు చేసుకున్నాడు.
సౌతాఫ్రికాతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో సౌతాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి.

చివరి ఓవర్ను హార్దిక్ పాండ్యా వేయగా.. క్రీజులో ఉన్న డేవిడ్ మిల్లర్ తొలి బంతినే భారీ షాట్ ఆడాడు. లాఫ్టెడ్ షాట్తో బంతిని అద్భుతంగా కనెక్ట్ చేశాడు. అయితే బౌండరీ లైన్ వద్ద సూర్య అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టాడు. దాంతో భారత ఆటగాళ్లతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత సౌతాఫ్రికా లక్ష్యాన్ని అందుకోలేక ఓటమికి తల వంచింది.
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషభ్ పంత్.. ఈ మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ గురించి మాట్లాడాడు. మిల్లర్ ఆడిన షాట్తో బంతి సికర్స్గా వెళ్లిందని భావించానన్నాడు. 'బంతి గాల్లోకి లేవగానే పక్కా సిక్సర్ అనుకున్నాను. ఎందుకంటే బ్యాట్కు బంతి బాగా కనెక్ట్ అయ్యింది. బ్యాట్కు బంతి తాకినప్పుడే ప్రపంచకప్ చేజారిందనుకున్నాను. కానీ భారత అభిమానుల ప్రార్థనల వల్ల బంతి బౌండరీ లౌన్ ధాటలేదు.
ఏ క్రికెటర్కు అయినా ప్రపంచకప్ గెలవడం లక్ష్యంగా ఉంటుంది. నేను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినప్పుడు టీ20 ప్రపంచకప్ ఆడాలని తరుచూ అనుకునేవాడిని. జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా టీ20 ప్రపంచకప్ను ముద్దాడటం నాకు అసాధారణమైన అనుభూతినిచ్చింది.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
2022 డిసెంబర్లో రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దాంతో ఏడాదిన్నర పాటు అతను ప్రోఫెషనల్ క్రికెట్కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్తో మళ్లీ బ్యాట్ పట్టిన రిషభ్ పంత్.. అసాధారణ ప్రదర్శన కనబర్చి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024లో 8 మ్యాచ్ల్లో ఒక హాఫ్ సెంచరీ సాయంతో 171 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.