వేగంగా సాగుతున్న మ్యాచ్కు బ్రేక్లు వేయాలనే ఉద్దేశంతోనే గాయమైనట్లు నటించానని టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచి 17 ఏళ్ల తర్వాత పొట్టి కప్ను ముద్దాడిన విషయం తెలిసిందే. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో రిషభ్ పంత్ తెలివిగా వ్యవహరించి టీమిండియా విజయానికి బాటలు వేసాడు.
సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్తో 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియాకు ఐసీసీ టైటిల్ దక్కింది. సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇన్నింగ్స్ మూమెంట్కు బ్రేక్ పడింది. అందుకు రిషభ్ పంత్ ప్రధాన కారణం. పంత్ మోకాలి నొప్పికి పట్టీ వేయించుకొనేందుకు సమయం తీసుకున్నాడు.

ఇటీవల ఓ షోలో పంత్ గాయంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ తెలివిగా వ్యవహరించాడని కితాబిచ్చాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఓ కార్యక్రమంలో పంత్ స్పందించాడు. అలా చేయడానికి గల కారణాన్ని వెల్లడించాడు. ఫిజియెకు కాస్త సమయం తీసుకోమని చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. పంత్ ఇన్నింగ్స్కు బ్రేక్ వేయడం వల్ల.. అప్పటి వరకు ధాటిగా ఆడిన హెన్రీచ్ క్లాసెన్ ఔటయ్యాడు.
పంత్ తెలివిని మెచ్చుకున్న రోహిత్ శర్మ.. ఈ ఒక్క కారణంతోనే భారత్ మ్యాచ్ గెలవలేదన్నాడు. తమ విజయానికి ఇది ఉపయోగపడిందని పేర్కొన్నాడు.
'మ్యాచ్ ఫలితం గురించి ఆలోచిస్తూ ఉన్నా. మ్యాచ్ వేగంగా మారిపోతుంది. అయితే, ఆ మూమెంట్ను మార్చాల్సిన అవసరం ఉందనిపించింది. ఎందుకంటే అప్పటికే గత మూడు ఓవర్లలో భారీగా పరుగులు వచ్చాయి. మేం ఆడుతోంది టీ20 ప్రపంచకప్ ఫైనల్. మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాశం రాదు. అప్పుడే నా మోకాలు కాస్త నొప్పిగా అనిపించింది.
ఫిజియోను పిలిపించాం. పట్టీ వేయడానికి సమయం తీసుకోవాలని అతనికి సూచించాను. అలా చేయడం వల్ల కాస్త టైమ్ వేస్ట్ అయ్యేలా చూడమని చెప్పా. అప్పుడు అంతా బాగానే ఉంది కదా అని ఫిజియో అడిగాడు. నేను యాక్టింగ్ చేస్తున్నానని చెప్పా. ఒక్కోసారి పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది. ప్రతీసారి ఇలా వర్కౌట్ అవుతుందని కాదు గానీ.. కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది.'అని పంత్ చెప్పుకొచ్చాడు.