టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై తాత్కలిక సారథి రిషభ్ పంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఇది నీ ఇల్లు కాదు'.. త్వరగా బౌలింగ్ చేయాలని మందలించాడు. సౌతాఫ్రికాతో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. బౌలింగ్ వేసేందుకు కుల్దీప్ ఎక్కువ సమయం తీసుకోవడంతో అసహనానికి గురైన పంత్.. అతన్ని మందలించాడు. రిషభ్ పంత్ వ్యాఖ్యలు స్టంప్ మైక్లో రికార్డ్ కావడంతో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 88వ ఓవర్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ వేసేందుకు కుల్దీప్ యాదవ్ సిద్దమయ్యాడు. కానీ అతను ఫీల్డింగ్ సెట్ చేస్తూ ఎక్కవ సమయం తీసుకున్నాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం ఓవర్ ముగిసిన తర్వాతి 60 సెకన్లలోపు మరో ఓవర్ను ప్రారంభించాలి. అప్పటికే భారత్ రెండు సార్లు ఈ రూల్ను ఉల్లంఘించడంతో అంపైర్ మందలించాడు. అప్పటికే రెండు సార్లు వార్నింగ్కు దిగడంతో పంత్ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం మూడో సారి ఈ తప్పిదం పునరావృతం చేస్తే ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు. దాంతోనే కుల్దీప్ యాదవ్పై పంత్ అరిచాడు.

క్రికెట్ మ్యాచ్ల్లో సమయాన్ని వృథా చేయకుండా అడ్డుకునేందుకు ఐసీసీ స్టాప్ క్లాక్ రూల్ను తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం ఒక ఓవర్ పూర్తయిన తర్వాత ఫీల్డింగ్ జట్టు 60 సెకన్ల వ్యవధిలో మరో ఓవర్ను ప్రారంభించాలి. ఈ సమయాన్ని మించితే అంపైర్ రెండు సార్లు వార్నింగ్ ఇస్తాడు. అయినా ఈ తప్పిదాన్ని పునరావృతం చేస్తే మూడోసారి వార్నింగ్ ఇవ్వకుండా 5 పరుగులను పెనాల్టీగా విధిస్తాడు. ప్రతీ 80 ఓవర్లకు ఒకసారి ఈ వార్నింగ్స్ రీసెట్ అవుతాయి. ఈ 80 ఓవర్లలో మూడు సార్లు ఈ తప్పిదం చేయకూడదు. బ్యాటర్లకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. బ్యాటర్ ఔటైన తర్వాత 3 నిమిషాల వ్యవధిలోనే మరో బ్యాటర్ వచ్చి బంతిని ఎదుర్కోవాలి. లేకపోతో టైమ్డ్ ఔట్గా ప్రకటిస్తారు.
భారత్తో రెండో టెస్ట్లో సౌతాఫికా తొలి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోర్ చేసింది. సెనరన్ ముత్తుసామి(206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 109) శతకంతో చెలరేగగా.. మార్కో జాన్సెన్(91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్లతో 93) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/115) నాలుగు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా(2/75), మహమ్మద్ సిరాజ్(2/106), రవీంద్ర జడేజా(2/94) రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది.