
న్యూఢిల్లీ: టీమిండియా తాత్కలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన రిషభ్ పంత్కు చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్కు చివరి నిమిషంలో కేఎల్ రాహుల్ దూరం కాగా.. పంత్ జట్టును నడిపించాడు. అయితే కెప్టెన్గా తన ఫస్ట్ మ్యాచ్లో పంత్కు విజయం దక్కలేదు. విధ్వంసకర బ్యాటింగ్తో భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. సఫారీ బ్యాటర్లు అలవోకగా చేధించారు. ఈ క్రమంలోనే పంత్.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు.
2017లో విరాట్ కోహ్లీ సైతం ఇలాగే తొలిసారి టీమిండియా టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి విఫలమయ్యాడు. కాన్పూర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఆ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అప్పుడు కోహ్లీ 29 పరుగులు సాధించగా.. ఇప్పుడు పంత్ కూడా 29 పరుగులే చేశాడు. అయితే, ఈ సిరీస్కు పంత్ అనూహ్యంగా కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మకు విశ్రాంతి నివ్వడంతో తొలుత కేఎల్ రాహుల్ను సారథిగా ఎంపిక చేశారు. కానీ, అతడు తొలి మ్యాచ్కు ముందు గాయం కారణంగా తప్పుకోవడంతో రిషభ్ పంత్కు అవకాశం ఇచ్చారు.
గురువారం జరిగిన ఈ మ్యాచ్లో మొదట భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 76; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా... హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ రిషభ్ పంత్ (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు.

అనంతరం దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. వాన్డెర్ డసెన్ (46 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) నాలుగో వికెట్కు 64 బంతుల్లోనే 131 పరుగులు జోడించి సిరీస్లో సఫారీకి శుభారంభం అందించారు.