
రూర్కీ: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతను ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగాయి. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో తన మెర్సిడెస్ కారును పంతే నడుపుతున్నట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పంత్ తల, పాదాలతో పాటు వీపు బాగంలో తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. న్యూఇయర్కు తల్లికి సప్రైజ్ ఇద్దామని సమాచారం ఇవ్వకుండా రిషభ్ పంత్ వచ్చినట్లు తెలుస్తోంది.
పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడనే వార్తలతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్కు గురైంది. అభిమానులతో పాటు దిగ్గజ ఆటగాళ్లు, స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
ఇటీవల బంగ్లా దేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. రెండో టెస్ట్లో అద్భుతంగా ఇన్నింగ్స్ ఆడిన పంత్ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో గత కొంత కాలంగా విఫలమవుతున్న పంత్పై బీసీసీఐ వేటు వేసింది. అతను మొకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడని, ఎన్సీఏలో 15 రోజులు గడపాలని ఆదేశించింది. బంగ్లాదేశ్ పర్యటన అనంతరం దుబాయ్ వెళ్లిన రిషభ్ పంత్ అక్కడ టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాడు.
ఆ వేడుకల అనంతరం స్వదేశానికి పయనమైన పంత్.. తల్లికి సప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో తన రాక గురించి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగ గాయపడ్డ పంత్.. సుమారు 6 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్కు ఈ ప్రమాదంతో ఊహించని షాక్ తగిలింది. తమ ప్రధాన ఆటగాడు కెప్టెన్ అయిన పంత్ సేవలను కోల్పోవడంతో ఆ జట్టు బలహీనంగా మారనుంది.