టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గొప్ప మనసు చాటుకున్నాడు. కర్ణాటకకు చెందిన ఓ పేద విద్యార్థికి ఆర్థిక సాయం చేశాడు. దాంతో పంత్పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. 'ఆటలో ధీరుడు.. గుణంలో కర్ణుడు'అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
కర్ణాటక, బాగల్కోట్ జిల్లాలోని రబకవి గ్రామానికి చెందిన జ్యోతి కనబూరమఠ్ చాలా తెలివైన విద్యార్థి. ఇంటర్లో(పీయూసీ) ఆమెకు 83 శాతం మార్పులు వచ్చాయి. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(బీసీఏ) చదవాలనేది ఆమె కోరిక. కానీ ఆమె తండ్రి తీర్థయ్యా చాయ్ వాలా. చిన్న టీ స్టాల్తో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాలేజీ ఫీజు కట్టేంత స్థోమత ఆయనకు లేదు. దాంతో జ్యోతి చదువు కష్టంగా మారింది. ఈ విషయం స్థానిక కాంట్రాక్టర్ అనిల్ హునశికట్టికి తెలిసింది. చదువుకోవాలనే ఆమె తపన చూసిన అనిల్.. ఎలాగైనా సాయం చేయాలనుకున్నాడు. బెంగళూరులోని తన స్నేహితులకు సమాచారమిచ్చాడు.

కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఈ విషయం రిషభ్ పంత్కు తెలిసింది. జ్యోతి కష్టం గురించి తెలుసుకున్న పంత్ ఆమెకు సాయం చేసేందుకు సిద్దమయ్యాడు. ఆమె ఫీజును చెల్లించేందుకు ముందుకు వచ్చాడు. గత నెల 17న తొలి సెమిస్టర్ ఫీజు కింద రూ. 40, 000 చెల్లించి జ్యోతి కోరుకుంటున్న జమఖండిలోని బీఎల్డీఈ కాలేజీలో అడ్మిషన్ ఇప్పించాడు. ఈ విషయాన్ని జ్యోతి మీడియాకు తెలుపుతూ భావోద్వేగానికి గురైంది. పంత్కు కృతజ్ఞతలు తెలియజేసింది. 'బీసీఏ చదవాలన్నది నా కల. కానీ మా ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం చదవడం సాధ్యం కాదనుకున్నా. అనిల్, పంత్ చేసిన ఈ సాయంతో నా కల నెరవేరింది. రిషభ్ పంత్కు దేవుడి ఆశీస్సులు ఉండాలి. అతను చేసిన సాయాన్ని మర్చిపోలేను.'అని జ్యోతి కన్నీటి పర్యంతమైంది.
రిషభ్ పంత్ చేసిన ఈ సాయంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలానే సాయం చేస్తూ.. మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో రిషభ్ పంత్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ పర్యటనలో నాలుగు మ్యాచ్లు ఆడిన పంత్ 7 ఇన్నింగ్స్ల్లో 68.42 సగటుతో 479 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కీపర్గా 13 క్యాచ్లతో పాటు ఓ స్టంపౌట్ చేశాడు. నాలుగో టెస్ట్లో పంత్ కాలికి తీవ్ర గాయమైంది. అతని కుడికాలి చివరి వేలికి ఫ్రాక్చర్ అయ్యింది. అయినా జట్టు కోసం పంత్ నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేశాడు. గాయం నుంచి కోలుకోవడానికి 5 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.