న్యూఢిల్లీ: టీమిండియా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. ఘోర రోడ్డు ప్రమాదంతో ఆటకు దూరమైన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. మొన్నటి వరకు ఊతకర్ర సాయంతో నడిచిన పంత్.. ఇప్పుడు ఎవరీ సాయం లేకుండా నడవడం మొదలుపెట్టాడు. జిమ్లో వర్కౌట్లు కూడా చేస్తున్నాడు. ఎవరీ సాయం లేకుండా మెట్లు కూడా ఎక్కుతున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. అతిత్వరలోనే పంత్ నెట్స్లో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టే సూచనలు కనబడుతున్నాయి. ఐపీఎల్ 2024 వరకు రిషభ్ పంత్ పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. రిషభ్ పంత్ వేగంగా కోలుకోవడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా పంత్ భారత జట్టులోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో రిషభ్ పంత్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. పంత్ను భర్తీ చేయగల వికెట్ కీపర్ లేడని, అతనిలా దూకుడుగా ఆడటం ఎవరి వల్ల కావడం లేదంటున్నారు. ముఖ్యంగా టెస్ట్ల్లో వికెట్ కీపర్ బ్యాట్స్మన్గా పంత్కు సాటిలేరని చెబుతున్నారు.
డిసెంబర్ 31న రిషభ్ పంత్ డ్రైవ్ చేస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కొత్త ఏడాది తన తల్లికి సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పంత్ చెప్పా పెట్టకుండా తన బీఎమ్డబ్ల్యూ కారులో ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ బయల్దేరగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి పంత్ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దగ్దమైంది.
బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో రిషభ్ పంత్ చికిత్స తీసుకుంటున్నాడు. మైదానంలో బరిలోకి దిగేందుకు పంత్ ఎదురు చూస్తున్నాడు.