ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలు తలెత్తినట్లు వార్తలు రావడం కలకలం రేపుతోంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహార శైలిపై డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అసంతృప్తిగా ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. తుది జట్టులో తనకు అవకాశం ఇవ్వకపోవడంపై గంభీర్ను రిషభ్ పంత్ నిలదీసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా గత శనివారమే దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం(ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్తో టీమిండియా తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది.అయితే ఈ టోర్నీలో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.

కేఎల్ రాహుల్కే అవకాశం..
ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లోని కాంబినేషన్నే దాదాపు కొనసాగించనున్నారు. బౌలింగ్ విభాగంలో మాత్రం కండిషన్స్కు తగ్గట్లు ఒకటి రెండు మార్పులు చేయనున్నారు. అయితే ఈ సిరీస్లో వికెట్ కీపర్గా రిషభ్ పంత్కు బదులు కేఎల్ రాహుల్కు టీమిండియా ప్రాధాన్యం ఇచ్చింది. మిడిలార్డర్లో ఆడగలడని, రిషభ్ పంత్ గైర్హాజరీలో వన్డే ప్రపంచకప్ 2023లో రాహుల్ మెరుగ్గా రాణించాడని అతన్నే కీపర్గా కొనసాగించింది.
టీ20ల్లో సంజూ.. వన్డేల్లో రాహుల్
తొలి రెండు వన్డేల్లో దారుణంగా విఫలమైన రాహుల్.. ఆఖరి వన్డేలో కీలక ఇన్నింగ్స్తో టచ్లో వచ్చాడు. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్నే వికెట్ కీపర్గా కొనసాగించనున్నారు. ఈ విషయాన్ని హెడ్ కోచ్ గౌతమ్ గంభీరే స్పష్టం చేశాడు. వికెట్ కీపర్గా తమ ఫస్ట్ చాయిస్ రాహులేనని మీడియా సమావేశంలో స్పష్టం చేశాడు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రిషభ్ పంత్కు పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. అతన్ని గంభీర్.. టెస్ట్ క్రికెట్కు మాత్రమే పరిమితం చేశాడు. టీ20ల్లో సంజూ శాంసన్ను వికెట్ కీపర్గా కొనసాగిస్తున్న గంభీర్.. వన్డేల్లో ఇప్పుడు కేఎల్ రాహుల్ను ఆడిస్తున్నాడు.
గంభీర్పై తిరగబడ్డ పంత్
రాహుల్ కంటే పంత్ డేంజరస్ బ్యాటర్. మిడిలార్డర్లో ఫినిషర్ పాత్రను సమర్థవంతంగా పోషించగలడు. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగలడు. అంతేకాకుండా పంత్ రాకతో జట్టులో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా వస్తోంది. అయినా పంత్ను కాదని గంభీర్.. రాహుల్కు ప్రాధాన్యత ఇస్తుండటం అతనికి ఆగ్రహం తెప్పించినట్లు ప్రముఖ వార్త సంస్థ పేర్కొంది. ప్రాక్టీస్ సెషన్ సమయంలో తన సామర్థ్యాలను వివరిస్తూ పంత్.. గంభీర్ను నిలదీసినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే తమ కథనంలో ఎక్కడా కూడా రిషభ్ పంత్ను పేరును ప్రస్తావించకుండా వికెట్ కీపర్గా పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి పంత్తో పాటు రాహుల్ మాత్రమే వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. ఇక రిషభ్ పంత్కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మద్దతు ఉన్నట్లు సమాచారం. కొన్ని మ్యాచ్ల వరకు గంభీర్ మాటను కాదనవద్దని ఈ ఇద్దరూ భావిస్తున్నట్లు తెలుస్తోంది.