టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై 1000 పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత వికెట్ కీపర్గా రికార్డ్ సాధించాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా మాంచెస్టర్ వేదికగా బుధవారం ప్రారంభమైన నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ ఈ ఫీట్ సాధించాడు. బ్రైడన్ కార్స్ వేసిన 61వ ఓవర్లో మూడో బంతిని లాంగాన్ దిశగా సిక్సర్ బాదిన పంత్.. ఇంగ్లండ్ గడ్డపై 1000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరే వికెట్ కీపర్ ఈ ఘనత సాధించలేదు.
ఇంగ్లండ్ గడ్డపైనే కాదు.. విదేశాల్లో రిషభ్ పంత్కు ముందు మరే వికెట్ కీపర్ కూడా టెస్ట్ల్లో 1000 పరుగులు చేయలేదు. ఇంగ్లండ్ గడ్డపై 1000 పరుగుల మైలురాయి అందుకున్న తొలి విజిటింగ్ వికెట్ కీపర్గా కూడా రిషభ్ పంత్ రికార్డ్ సాధించాడు. ఈ జాబితాలో రిషభ్ పంత్ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ(778), రాడ్ మార్ష్(773), జాన్ వైట్(684), ఇయాన్ హీలీ(624) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అయితే క్రిస్ వోక్స్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. 68వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతి.. రిషభ్ పంత్ షూకు బలంగా తాకింది. ఈ బంతి ధాటికి పంత్ పాదం వాచిపోవడంతో పాటు రక్త స్రావం జరిగింది. నొప్పితో విలవిలలాడిన పంత్.. పాదాన్ని నేలపై పెట్టలేకపోయాడు. దాంతో అంబులెన్స్ సాయంతో పంత్ను మైదానం బయటకు తీసుకెళ్లారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రిషభ్ పంత్ బయటకు వెళ్లడంతో జడేజా బ్యాటింగ్కు వచ్చాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 83 ఓవర్లలో 4 వికెట్లకు 264 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 58), సాయి సుదర్శన్(151 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కేఎల్ రాహుల్(98 బంతుల్లో 4 ఫోర్లతో 46), రిషభ్ పంత్(48 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 37) విలువైన పరుగులు చేశారు.
కెప్టెన్ శుభ్మన్ గిల్(12) విఫలమవ్వగా.. రవీంద్ర జడేజా(19 బ్యాటింగ్), శార్దూల్ ఠాకూర్(19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీయగా.. క్రిస్ ఓక్స్ ఓ వికెట్ తీసాడు. తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.