భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ క్షమాపణలు చెప్పాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్లో అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయామని, తమను మన్నించాలని కోరాడు. గౌహతి వేదికగా బుధవారం ముగిసిన రెండో టెస్ట్లో సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
ఈ విజయంతో రెండు టెస్ట్ల సిరీస్ను 2-0తో సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలుపొందింది. వరుసగా రెండో ఏడాది టెస్ట్ సిరీస్లో టీమిండియా క్లీన్ స్వీప్ అయ్యింది. దాంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ నొప్పితో దూరమవడంతో వైస్ కెప్టెన్గా రిషభ్ పంత్ జట్టును నడిపించాడు. కానీ 93 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలోనే ఏన్నడు లేని పరాజయాన్ని టీమిండియా చవిచూసింది.

ఈ క్రమంలోనే అభిమానులకు క్షమాపణలు చెబుతూ రిషభ్ పంత్ సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పంచుకున్నాడు. 'గత రెండు వారాలుగా మేం సరిగ్గా ఆడలేదనేది నగ్న సత్యం. జట్టుగా.. వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని, కోట్లాది మంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావాలని కోరుకుంటాం. కానీ ఈ సారి మేం మీ అంచనాలను అందుకోలేకపోయాం. అందుకు మమ్మల్ని క్షమించండి. కానీ క్రీడల్లో ఓటమి ఎప్పుడూ జట్టుగా.. వ్యక్తిగతంగా గుణపాఠం నేర్పుతుంది. మరింత మెరుగవ్వాలని విషయాన్ని సూచిస్తుంది.
భారత్ దేశానికి ప్రాతినిథ్యం వహించడం మా జీవితాల్లోనే మాకు దక్కిన అతిపెద్ద గౌరవం. ఈ జట్టు సామర్థ్యం ఏంటో మాకు తెలుసు. మేం మరింత కష్టపడుతాం. మా ఆటపై మరింత ఫోకస్ పెడ్తాం. వ్యక్తిగతంగా జట్టుగా నేలకు కొట్టిన బంతిలా తిరిగి వస్తాం. మీ అమితమైన మద్దతు, ప్రేమకు ధన్యవాదాలు. జైహింద్'అని పంత్ తన సుదీర్ఘ పోస్ట్లో పేర్కొన్నాడు.
టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా.. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం సిద్దమవుతోంది. నవంబర్ 30న రాంచీ వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఈ సిరీస్తో కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ ఇవ్వనుండగా.. బుమ్రా, సిరాజ్, శుభ్మన్ గిల్కు రెస్ట్ ఇచ్చారు. కేఎల్ రాహుల్ భారత జట్టును నడిపించనున్నాడు.