టెస్ట్ క్రికెట్లో టీమిండియా మరో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుసగా రెండో ఏడాది సొంతగడ్డపై క్లీన్ స్వీప్ అయ్యింది. సౌతాఫ్రికాతో బుధవారం ముగిసిన రెండో టెస్ట్లో టీమిండియా 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా టీమిండియాకు అతిపెద్ద ఘోర పరాజయం ఇది. దాంతో సౌతాఫ్రికా ఈ రెండు టెస్ట్ల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ సిరీస్ విజయాన్నందుకుంది.
549 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా 27/2 ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. రెండో ఇన్నింగ్స్లో 140 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా(87 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 54) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మర్(6/37) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్(2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్, సీనర్ ముత్తుసామి తలో వికెట్ తీసారు.

టీమిండియా పరాజయం ఖాయమైన క్షణం తాత్కలిక కెప్టెన్ రిషభ్ పంత్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని రిషభ్ పంత్ ఆపుకునే ప్రయత్నం చేశాడు. కన్నీళ్లను తుడుచుకుంటూ కనిపించాడు. మరోవైపు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తీవ్ర బాధలో కనిపించాడు. ఈ ఓటమిని ఈ ఇద్దరూ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఈ ఇద్దరూ బాధపడుతూ ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.
మ్యాచ్ అనంతరం బ్రాడ్కాస్టర్తో రిషభ్ పంత్ భావోద్వేగంగానే మాట్లాడాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడంతోనే ఓటమిపాలయ్యామని చెప్పాడు. ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని మరింత మెరుగవుతామని తెలిపాడు.
మరోవైపు గౌతమ్ గంభీర్ ఈ ఓటమికి తనతో సహా జట్టులోని ప్రతీ ఒక్కరు నిందలు పడాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. హెడ్ కోచ్గా తన భవితవ్యాన్ని బీసీసీఐ నిర్ణయిస్తుందని చెప్పాడు. జట్టు కంటే ఎవరూ ఎక్కువ కాదని తాను తరుచూ చెబుతూ ఉంటానని గుర్తు చేశాడు. అయితే తన హయాంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్తో పాటు ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా టెస్ట్ సిరీస్ సమం చేసుకుందని తెలిపాడు.