సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా, కార్బిన్ బోష్ అద్భుతమైన భాగస్వామ్యంతో తమ ఓటమిని శాసించారని టీమిండియా తాత్కలిక కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. ఈ భాగస్వామ్యాన్ని త్వరగా విడదీసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఛేదించలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రిషభ్ పంత్.. అనవసర ఒత్తిడితో వికెట్లు పారేసుకున్నామని చెప్పాడు. పిచ్ కూడా బ్యాటింగ్కు ప్రతికూలంగా మారిందని తెలిపాడు.
'ఇలాంటి మ్యాచ్ గురించి ఎక్కువగా ఆలోచించలేం. ఈ లక్ష్యాన్ని మేం ఛేదించాల్సింది. కానీ అనవసర ఒత్తిడితో వికెట్లు కోల్పోయాం. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు ఆడలేకపోయాం. ఈ ఉదయం(మూడో రోజు ఆట) టెంబా బవుమా, కార్బిన్ బోష్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ పార్ట్నర్షిప్ మాకు తీవ్ర నష్టం చేసింది.
వికెట్ నుంచి కొంత సహకారం ఉంది. కానీ ఈ తరహా వికెట్లపై 120 పరుగుల లక్ష్యం కూడా కష్టంగా ఉంటుంది. అయితే మేం ఒత్తిడిని తట్టుకొని కండిషన్స్కు తగ్గట్లు ఆడాల్సింది. మెరుగయ్యే విషయాల గురించి మేం ఇంకా ఆలోచించలేదు. కానీ తదుపరి మ్యాచ్కు కచ్చితంగా బలంగా తిరిగి వస్తాం.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.

93/7 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ టెంబా బవుమా(136 బంతుల్లో 4 ఫోర్లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీకి తోడుగా కార్బిన్ బోష్(37 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 25) రాణించాడు. ఈ ఇద్దరూ 8వ వికెట్కు 44 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ భాగస్వామ్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది.
124 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 93 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్(92 బంతుల్లో 2 ఫోర్లతో 31) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(0), కేఎల్ రాహుల్(1), ధ్రువ్ జురెల్(13), రిషభ్ పంత్(2), రవీంద్ర జడేజా(18), కుల్దీప్ యాదవ్(1 నాటౌట్), మహమ్మద్ సిరాజ్(0) తీవ్రంగా నిరాశపర్చారు.
చివర్లో అక్షర్ పటేల్(26) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. తీవ్ర మెడనొప్పితో శుభ్మన్ గిల్ ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే. దాంతో అతను బ్యాటింగ్కు రాలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మర్(4/21)తో పాటు మార్కో జాన్సన్(2/15), కేశవ్ మహరాజ్(2/37) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఎయిడెన్ మార్క్రమ్ ఒక వికెట్ దక్కింది.