న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకున్నాడు. సోషల్ మీడియా ఖాతాల్లోని తన బయో డేటాలో సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ 05-01-2023 అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం పంత్ బయోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక గతేడాది డిసెంబర్లో రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కొత్త ఏడాదికి తన తల్లికి సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పాపెట్టకుండా సొంత బీఎండబ్ల్యూ కారులో ఇంటికి బయలు దేరిన పంత్ ఘోర ప్రమాదానికి గురయ్యాడు. నిద్రమత్తులో రోడ్డు డివైడర్ను వేగంగా ఢీకొట్టడంతో మంటలు చెలరేగి అతను డ్రైవ్ చేస్తున్న కారు పూర్తిగా దగ్దమైంది.

ఓ బస్ డ్రైవర్, కండక్టర్ సాయంతో ప్రాణాలతో బయటపడ్డ రిషభ్ పంత్కు బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో పలు సర్జరీలు జరిగాయి. వేగంగా కోలుకున్న పంత్.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదం తర్వాత ప్రాణాపాయం లేదని వైద్యుల తెలిపిన తేదీనే పంత్ రెండో బర్త్డే డేట్గా ప్రకటించుకున్నాడు.
వాస్తవానికి రిషభ్ పంత్ 1997లో అక్టోబర్ 4న జన్మించాడు. రోడ్డు ప్రమాద గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న అతను ఇటీవలే ఊత కర్ర సాయం లేకుండా స్టెప్స్ కూడా ఎక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. జిమ్ సెషన్ కూడా ప్రారంభించిన పంత్.. వన్డే ప్రపంచకప్ ఆడాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. కానీ అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఒక వేళ పంత్ కోలుకున్నా.. అతన్ని నేరుగా జట్టులోకి తీసుకుంటే తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది.
వికెట్ కీపర్ అయిన పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించాల్సిన అవసరం ఉంటుంది. మొకాలికి తీవ్ర గాయమైన నేపథ్యంలో మునపటిలా వికెట్ కీపింగ్ చేయగలుగుతాడా? అనేది కూడా సందేహంగా మారింది. ఏది ఏమైనా వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్కు పంత్ అందుబాటులోకి వస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.