భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ తీరుపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టెస్ట్ క్రికెట్ను చంపేస్తున్నారు కదరా? అంటూ మండిపడ్డాడు. రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మూడు రోజుల్లోనే ముగిసేలా ఉంది. పిచ్ ఏకపక్షంగా బౌలర్లకు సహకరిస్తుండటంతో బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకు ఆలౌటైంది. ఎయిడెన్ మార్క్రమ్(48 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 31), వియాన్ మల్డర్(51 బంతుల్లో 3 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(5/27) ఐదు వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించగా.. మహమ్మద్ సిరాజ్(2/47), కుల్దీప్ యాదవ్(2/36) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్కు ఒక వికెట్ దక్కింది.

అనంతరం భారత్ 189 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్(119 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 39), వాషింగ్టన్ సుందర్(82 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రిషభ్ పంత్(45 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27), రవీంద్ర జడేజా(45 బంతుల్లో 3 ఫోర్లతో 27) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(3/35), సిమన్ హర్మర్(4/30) భారత్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్, కోర్బిన్ బోష్ చెరో వికెట్ పడగొట్టారు.
30 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 153 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ టెంబా బవుమా(136 బంతుల్లో 4 ఫోర్లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. కార్బిన్ బోష్(37 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 25) అండగా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(4/50) నాలుగు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/30), మహమ్మద్ సిరాజ్(2/2) రెండేసి వికెట్లు పడగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్కు చెరో వికెట్ దక్కింది. దాంతో భారత్ ముందు 124 పరుగుల లక్ష్యం నమోదైంది.
తొలి రోజు 11 వికెట్లు కుప్పకూలగా.. రెండో రోజు 16 వికెట్లు పడ్డాయి. పూర్తిగా పిచ్ బౌలింగ్కు సహకరించేలా తయారు చేయడంపై హర్భజన్ సింగ్ ఫైర్ అయ్యాడు. ఆర్ఐపీ టెస్ట్ క్రికెట్ అంటూ ట్వీట్ చేశాడు. 'భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ దాదాపు రెండో రోజే ముగిసింది. మ్యాచ్ ఇంకా పూర్తి కాలేదు. కానీ ఫలితం తేలిపోయింది. టెస్ట్ క్రికెట్ను ఎంత అపహాస్యం చేస్తున్నారు.'అని #RIPTESTCRICKET యాష్ ట్యాగ్తో భజ్జీ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. వాస్తవానికి సమతూకమైన పిచ్ కావాలని టీమిండియా మేనేజ్మెంట్ కోరింది. కానీ కోల్కతా క్యూరెటర్ బౌలింగ్కు అనుకూలంగా ఉండే పిచ్ ఇచ్చాడు. ఈ పిచ్పై భారత జట్టు కూడా అసంతృప్తిగానే ఉంది.